జమ్మూకశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్(Murali Naik) వీరమరణం పొందారు. పాక్ కాల్పులను భారత జవాన్లు ధీటుగా తిప్పికొడుతున్నారు. అయితే ఈ కాల్పుల్లో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ అధికారులు కుటుంసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
జవాన్ వీర మరణం పొందడంపై ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు మురళీ నాయక్కు నివాళులర్పిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. “దేశ రక్షణలో శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు మురళీ నాయక్కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.