ఏపీలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి ఉగ్రరూపంతో ఎండలు(Heat Wave) మండిపోతున్నాయి. బయటకు రావాంటేనే జనం జంకుతున్నారు. వడగాలులు ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఠారెత్తుతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సగటున 40 డిగ్రీలకు చేరాయి. సాధారణం కంటే 4 డిగ్రీల వరకూ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రకాశం జిల్లా కొమరోలు, నంద్యాల, కమలాపురంలో అత్యధికంగా 42.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఎస్ కోట, అనకాపల్లి, అన్నమయ్య జిల్లా రుద్రవరంలో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కర్నూలు జిల్లా కొసిగి, శ్రీకాకుళం జిల్లా మిళియాపుట్టు, సత్యసాయి జిల్లా తాడిమర్రి, సబ్బవరం, వీరఘట్టంలో 41 డిగ్రీలు.. అనంతపురం జిల్లా గుంతకల్లు, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం, తిరుపతి, నెల్లూరులో 40 డిగ్రీలు.. చిత్తూరు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేట, ఏలూరు తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు.