మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య(Viveka Murder Case) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా పీఏ కృష్ణారెడ్డి పెట్టింది తప్పుడు కేసు అని పులివెందుల పోలీసులు తేల్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్పై 2023 డిసెంబర్ 15న పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా సునీత, రాజశేఖ్ రెడ్డి, రామ్ సింగ్పై వివేకా పీఏ తప్పుడు కేసు పెట్టారని విచారణలో తేలిందని పులివెందుల పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు జమ్మలమడుగు కోర్టులో చివరి ఛార్జ్షీట్ను పులివెందుల డీఎస్పీ దాఖలు చేశారు. పులివెందుల మెజిస్ట్రేట్ సెలవులో ఉన్నందున జమ్మలమడుగు కోర్టులో సమర్పించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన సాక్షులు వరుసగా మరణించడంపై ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో సాక్షుల మరణంపై లోతుగా మళ్లీ దర్యాప్తు చేయాలని డీజీపీని ఆదేశించింది.