ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు(Nagababu) పేరు ఖరారైంది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పేరును డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చారు. నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని ఆదేశించారు. ఈమేరకు జనసేన పార్టీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
కాగా మార్చి 29తో ఎమ్మెల్యే కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈ ఐదు స్థానాలు కూటమికి దక్కనున్నాయి. ఇందులో ఓ స్థానం జనసేనకు కేటాయించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారుచేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంటనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.