Nara Lokesh: తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
“అన్నా..అన్నా… అని పిలిచేవాడివి ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా ? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు. తమ్ముడు ఐ మిస్ యూ. నువ్వు ఆత్మహత్య చేసుకున్న సంగతి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని నిన్ను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను.. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తాను” అంటూ ఎమోషనల్ అయ్యారు.
“తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నా విన్నపం. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలో ఏమైనా కానివ్వండి. కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు.. ఎవరితోనైనా షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బతికి ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం.. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దు” అంటూ లోకేష్ విజ్ఞప్తి చేశారు.
కాగా అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలానికి చెందిన శీను అనే టీడీపీ కార్యకర్త రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న లోకేష్ హుటాహుటిన చిలకలూరిపేట ఆసుపత్రి నుంచి తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తూ ఇవాళ ఉదయం అతడు కన్నుమూశాడు.