Nara Lokesh: రాబోయే ఆరు నెలల్లో సిలికాన్ వ్యాలీ మాదిరిగా ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ టెక్నాలజీ వంటి మోడ్రన్ టెక్నాలజీ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేశ్ కోరారు.
దేశంలో పేరొందిన దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. బెంగుళూరులోని మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో నారా లోకేశ్ రోడ్ షో నిర్వహించారు.
జీసీసీ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ ఈ విధంగా మాట్లాడారు. “ఇప్పుడు ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం. ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ మాదిరిగా.. భారతదేశంలోనే తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతిలో రాబోయే ఆరు నెలల్లో క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం చేస్తాము. ఇది భారత్ దేశ సాంకేతిక విప్లవంలో గేమ్ ఛేంజర్గా నిలవనుంది. మరోవైపు విశాఖపట్నం సిటీ ఐటీ హబ్గా మారుతోంది. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తుంది. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా రాయితీలు ఆఫర్ చేస్తున్నాం. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి” ప్రతినిధులకు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.


