వైసీపీ మాజీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్, సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డిపై(Sajjala Bhargava Reddy) సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సంబంధించిన కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే రెండు వారాల లోపు ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని.. ఆలోపు అరెస్టు నుంచి మధ్యంతర ఉపశమనం కల్పించింది.
విచారణ సందర్భంగా సోషల్ మీడియాలో సజ్జల భార్గవరెడ్డి పెట్టిన పోస్టులపై జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం మండిపడింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తమకు అర్థం కాలేదనుకున్నారా? అని నిలదీసింది. ఏ ఆలోచనతో పోస్టులు పెట్టారో ఆ మాత్రం తెలుసుకోలేమా?అని ఫైర్ అయింది. ఇలాంటి వాటిని వ్యవస్థ క్షమించదని.. తప్పక శిక్షిస్తుందని హెచ్చరించింది. సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుందనుకోవద్దని పేర్కొంది. బెయిల్ అంత త్వరగా వస్తే ప్రతి ఒక్కరూ ఇష్టారీతిన వ్యవహరిస్తారని ధ్వజమెత్తింది.