తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఈనెల 4వ తేదీన సమావేశం కానుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు కులగణన సర్వే నివేదికను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అంతకుముందుగా ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కులగణన సర్వే నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం శాసనసభలో ఈ నివేదికను ప్రవేశపెట్టనున్నారు.
కాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(UttamKumar Reddy) ఆధ్వర్యంలోని సబ్ కమిటీకి కులగణ నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు అందజేశారు. రాష్ట్రంలో 50 రోజుల పాటు కులగణన సర్వే జరిగింది. 1,03,889 మంది అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 96.9 శాతం కుటుంబాల నుంచి సమాచారం సేకరించారు. ఈ నేపథ్యంలో సర్వేలో పాల్గొన్న సిబ్బందికి మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ధన్యవాదాలు తెలిపారు. ఇది సువర్ణక్షరాలతో లిఖించదగిన రోజు అన్నారు. ఈ సర్వేను అడ్డుకోవడానికి దుష్ప్రచారాలు చేశారని ఆరోపించారు. ఏడాదిలోనే సర్వే నివేదిక తయారుచేయడం తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.