వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి(Vallabhaneni Vamsi) నూజివీడు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రస్తుతం వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మరోవైపు గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వంశీని మెరుగైన చికిత్స నిమిత్తం పోలీసులు గుంటూరులోని జీజీహెచ్కు తరలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న వంశీ భార్య పంకజశ్రీ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే వంశీని కలిసేందుకు పంకజశ్రీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం వంశీకి వైద్యం అందిస్తున్నారని, ఈ సమయంలో ఎవరినీ కలిసేందుకు అనుమతించలేమని స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు, పంకజశ్రీకి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం చికిత్స పూర్తి కావడంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు.