మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య(Viveka Murder Case) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుసగా అనుమానాస్పదంగా మృతి చెందుతుండటం కలకలం రేపుతోంది. దీంతో ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి(Dastagiri) పోలీసులు భద్రతను పెంచారు. ప్రస్తుతం 1 ప్లస్ 1 సెక్యూరిటీ ఉన్న భద్రతను 2 ప్లస్ 2కి పెంచుతూ కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా వివేకా హత్య కేసులో సాక్షులు వరుసగా మృతి చెందడంపై దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. తనకు కూడా భద్రత పెంచాలంటూ కడప జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించారు. తాను కడప జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ చైతన్య రెడ్డి తనను బెదిరించారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరికి పోలీసులు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మరణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని డీజీపీని ఆదేశించింది.