Telangana anti-narcotics bureau major drug bust : హైవేపై జోరుగా దూసుకెళ్తున్న ఓ బొలేరో వాహనం… దాని వేగం అధికారులకు అనుమానం కలిగించింది. మామూలు తనిఖీ అని ఆపితే… లోపల చూసి వారు నిర్ఘాంతపోయారు! కళ్లు బైర్లు కమ్మేంత సరుకు, ఒళ్లు గగుర్పొడిచే ఆయుధాలు..! అసలు ఆ వాహనంలో ఏముంది..? కోట్ల విలువైన ఆ సరుకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది..? ఈ భారీ గంజాయి దందా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు..?
ఉక్కుపాదం మోపిన ఈగల్ టీమ్: తెలంగాణలో డ్రగ్స్, గంజాయి రవాణాపై నార్కోటిక్స్ బ్యూరో మరియు ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపుతున్నాయి. పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేస్తూ స్మగ్లర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో, ఒడిశా నుండి ఉత్తరప్రదేశ్కు భారీ ఎత్తున గంజాయి తరలిపోతోందన్న విశ్వసనీయ సమాచారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు అందింది. గంజాయి ముఠాలు ఇటీవల మరింత రెచ్చిపోతుండటంతో, ఖమ్మం టీమ్ ఈ నెట్వర్క్పై ప్రత్యేక దృష్టి సారించింది.
పక్కా స్కెచ్ – పకడ్బందీ ఆపరేషన్: ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని రాజమండ్రి, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్కు తరలిస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ఖమ్మం, ఈగల్, మరియు సైబరాబాద్ నార్కోటిక్ విభాగాల సిబ్బందితో కూడిన ఒక సంయుక్త బృందం రంగంలోకి దిగింది. పక్కా ప్రణాళికతో, శంషాబాద్ సమీపంలోని బెంగళూరు జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు.
బొలేరోలో బయటపడ్డ బండారం: తనిఖీల సమయంలో, వేగంగా వస్తున్న ఓ బొలేరో వాహనాన్ని అధికారులు అడ్డగించారు. పైకి మామూలుగా కనిపించినా, వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అసలు బండారం బయటపడింది. వాహనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలలో, 26 పెద్ద బ్యాగుల్లో ప్యాక్ చేసిన గంజాయిని గుర్తించారు. మొత్తం 411 ప్యాకెట్లలో ఉన్న 847 కిలోల గంజాయిని చూసి అధికారులు నివ్వెరపోయారు. స్వాధీనం చేసుకున్న ఈ సరుకు విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 4 కోట్లు ఉంటుందని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ రూపేష్ అంచనా వేశారు.
కింగ్పిన్తో పాటు కీలక నిందితులు: పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం దందాకు ఉత్తరప్రదేశ్కు చెందిన షఫీ అనే వ్యక్తి కింగ్పిన్గా వ్యవహరిస్తున్నట్లు విచారణలో తేలింది. ఒడిశాకు చెందిన రమేష్ సుక్రీ, జగదీష్ కల్దీప్లు గంజాయిని కొనుగోలు చేసి, ఖిల్లా ధన, రాజేందర్ భజింగ్ అనే వ్యక్తుల ద్వారా ఈ వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, గంజాయితో పాటు వాహనంలో కత్తులు వంటి మారణాయుధాలు కూడా లభ్యం కావడంతో పోలీసులు షాకయ్యారు. అరెస్టయిన ఇద్దరు నిందితులపై గతంలోనూ కేసులున్నాయని, వారు జైలు శిక్ష కూడా అనుభవించారని పోలీసులు తెలిపారు.
ఈ స్పెషల్ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన ఖమ్మం టీమ్ను ఎస్పీ రూపేష్ ప్రత్యేకంగా అభినందించారు. కీలక నిందితుల వివరాలు లభ్యం కావడంతో, ఒడిశా-యూపీ గంజాయి నెట్వర్క్ డొంకను పూర్తిగా కదిలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.


