ఇటీవలి కాలంలో ఎన్నో కుటుంబాల్లో అంతరంగిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అనుకోని ప్రమాదాలు పెరిగిపోతున్నాయని చాలా మంది చెబుతున్నారు. ఇంట్లో ఒక అసహజమైన భావన నెలకొన్నట్టు అనిపిస్తున్నప్పుడు, అది దిష్టి ప్రభావమై ఉండొచ్చని చాలా మంది భావిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, చెడు శక్తుల ప్రభావం ఇంటిపై ఉంటే చిన్న చిన్న విషయాల్లో గొడవలు, ఆరోగ్య సమస్యలు, పనుల్లో ఆటంకాలు కనిపించవచ్చు. ఇలాంటి ప్రతికూల శక్తులను తొలగించడానికి, పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించడానికి ఒక పవిత్రమైన సందర్భం నరసింహ జయంతి.
విష్ణువు దశ అవతారాలలో నాలుగవదైన నరసింహ స్వామి, అసురశక్తులను సంహరించడానికి.. భక్తుల రక్షకుడిగా నిలిచినవాడు. నరసింహుడి ఆరాధన చెడు శక్తులను దూరం చేసే శక్తివంతమైన మార్గమని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం మే 11న నరసింహ జయంతి జరుపుకుంటారు. వైశాఖ శుక్ల చతుర్దశి నాడు జరిపే ఈ పూజ సాయంత్రం వేళలో జరగాలి.
పూజ సమయంలో నరసింహుడి ఫోటోను ఇంట్లో పెట్టి, షోడశోపచారాలతో పూజ చేయాలి. అష్టోత్తర శతనామావళి చదవాలి. నిపుణుల సూచనల ప్రకారం, ఈ రోజు నరసింహుని చిత్రాన్ని ఇంటి మెయిన్ డోర్ దగ్గర పెట్టడం ఎంతో శుభదాయకం. దీని వలన ఇంట్లోకి ఎలాంటి దుష్ప్రభావం ప్రవేశించదని నమ్మకం. ఇలాగే నరసింహ కవచాన్ని పఠించడం, గంధధూపాలు వెలిగించడం ద్వారా ఇంటి శుద్ధి చేయడం కూడా అవసరం.
ఈ చర్యల వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. వాస్తు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయని నమ్మకం. (గమనిక: ఈ కథనం ఇది పూర్తిగా విశ్వాసాల ఆధారంగా రూపొందించిన సమాచారం. ఏదైనా ప్రారంభించే ముందు, అనుభవజ్ఞులైన పండితుల సలహా తీసుకోవడం మేలుగా ఉంటుంది.)