PM MODI MEETS MPS : ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాద నిర్మూలనపై భారత స్థానాన్ని ప్రపంచ దేశాలకు సమర్థవంతంగా వివరించి వచ్చిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారతదేశం తన వైఖరిని స్పష్టం చేయడంలో మరియు అంతర్జాతీయ మద్దతును కూడగట్టడంలో సాధించిన పురోగతిని సమీక్షించారు.
ప్రధాని మోదీ ప్రశంసలు :
ప్రధాని అధికార నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తమ విదేశీ పర్యటన విశేషాలను, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచ వేదికలపై తాము కూడగట్టుకున్న మద్ధతుని ఎంపీలు ప్రధానికి వివరించారు.ఈ అఖిలపక్ష బృందంలో భాజపా ఎంపీలు రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే, జేడీ(యూ) ఎంపీ సంజయ్ కుమార్ ఝా వంటి ప్రముఖులు ఉన్నారు. వీరంతా కలిసి ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటించి, దాయాది దేశం పాక్ ఉగ్రవాద మద్దతును తీవ్రంగా ఎండగట్టారు. వారి సమష్టి కృషికి ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ దౌత్యపరమైన ప్రయత్నాలు అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు.
అంతకుముందే, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ ప్రతినిధుల బృందంతో సమావేశమై, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృక్పథాన్ని తెలియజేశారు..