Maoist Ceasefire Collapses Within 24 Hours: మావోయిస్టులు జపించిన శాంతి మంత్రం 24 గంటలు కూడా నిలవలేదు. శాంతి చర్చలకు సిద్ధమంటూ, ఆయుధాలు వీడతామంటూ చేసిన నాటకీయ ప్రకటన వెనుక ఉన్న అసలు స్వరూపం బయటపడింది. ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతేవాడ జిల్లాల్లో ఇద్దరు అమాయక పౌరులను మావోయిస్టులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 16-17 మధ్య రాత్రి ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలో, బెంచారామ్ పంచాయతీ ఉప సర్పంచ్ అయిన దశ్రు రామ్ ఓయమ్ను భైరమ్గఢ్ ఏరియా కమిటీ మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారు. అతను పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని ఆరోపిస్తూ దారుణంగా చంపేశారు. ఇదే తరహాలో దంతేవాడ జిల్లాలోని నీలవాయ గ్రామస్థుడైన బండి కొర్రమ్ను మలంగీర్ ఏరియా కమిటీ సభ్యులు ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి హత్య చేశారు.
ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధమని ఆగస్టు 15వ తేదీతో ఒక ప్రకటన విడుదల చేసి, మరోవైపు ఇలా పౌరులను పొట్టనబెట్టుకోవడం వారి ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఆశ్చర్యకరంగా, ఈ హత్యల తర్వాత కూడా మావోయిస్టు ప్రతినిధి అభయ్, తాము కాల్పుల విరమణ ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని ఎన్డీటీవీకి ఒక ఆడియో సందేశం పంపడం గమనార్హం.
ఈ ఘటనలపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. మావోయిస్టుల చిత్తశుద్ధిలేని ప్రకటనలను నమ్మబోమని, బస్తర్ ప్రాంతంలో భద్రతా ఆపరేషన్లను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2026 మార్చి నాటికి దేశం నుంచి మావోయిజాన్ని తరిమికొట్టాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యాన్ని వారు గుర్తుచేశారు. ఈ తాజా హత్యలతో మావోయిస్టులతో శాంతి చర్చల ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది.


