స్నేహితులు వేసిన ఓ పందెం.. యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. సరదాగా మొదలైన మద్యం పందెం.. విషాదంతో ముగిసింది. మద్యం మత్తులో మాట్లాడిన మాటలను నిజంగా చేసి చూపిస్తానన్న యువకుడి ఆత్మవిశ్వాసం.. చివరికి అతడి ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని కొలార్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల కార్తీక్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ సరదాగా సిటింగ్ వేశాడు.
ఈ సమయంలో వెంకట రెడ్డి అనే స్నేహితుడు అతనితో రూ.10,000 పందెం కాశాడు.. ఐదు ఫుల్ బాటిళ్లు నీరు కలపకుండా తాగితే.. డబ్బు ఇస్తానని బెట్ వేశాడు. సవాల్ స్వీకరించిన కార్తీక్ ఒక్కొక్కటిగా ఐదు సీసాలు ఎత్తేశాడు.
అయితే మద్యం తాగిన కొద్దిసేపటికే అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. కార్తీక్ను స్నేహితులు హుటాహుటిన ముల్బాగల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కార్తీక్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన భార్య ఎనిమిది రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
కార్తీక్ మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసి, మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. సరదాగా మొదలైన ఓ పందెం, ఒక యువకుడి జీవితాన్ని బలిగొన్న విషాద ఘటనగా నిలిచింది.