Ahmedabad Plane Crash Review Committee: విమాన ప్రమాదంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వివరాలను వెల్లడించారు. హోం సెక్రటరీ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీ వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కమిటీ ప్రమాదానికి గల కారణాలపై స్వతంత్రంగా దర్యాప్తు జరిపి, పటిష్టమైన భద్రతా చర్యలను, నియంత్రణ విధానాలను సిఫారసు చేయనుంది. 3 నెలల్లో దర్యాప్తు జరిపి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాతే బాధ్యులపై కేంద్రం చర్యలు తీసుకోనుంది. ఈ విమాన ప్రమాదాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని కేంద్రమంత్రి అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజా అధికారిక నివేదికల ప్రకారం, ఈ ఘోర దుర్ఘటనలో మృతుల సంఖ్య 274కు చేరింది. మృతుల్లో విమానంలోని 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటు, బీజే మెడికల్ కాలేజీకి చెందిన వసతి గృహ సముదాయంలో ఉన్న కొందరు మెడికోలు ప్రాణాలు కోల్పోయారు.
పెరుగుతున్న మృతుల సంఖ్య: అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్ సమీపంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహంపై కూలిపోయింది. విమానంలోని 244 మందిలో (230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 12 మంది సిబ్బంది) విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు తప్ప అందరూ మరణించారు. విమానం కూలిన ఘటనలో వసతి గృహంలో మొదట 22 మంది మృతి చెందగా తాజాగా ఆ సంఖ్య 33 కి చేరింది. దీంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 274కి చేరుకుంది.