Indian Icon Awards To MD Chandra Shekara Sarma Samayamantri: తెలుగుప్రభ దినపత్రిక ఎండీ సమయమంత్రి చంద్రశేఖర శర్మ ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఐకాన్ అవార్డు-2025 అందుకున్నారు. ఈ కార్యక్రమం సోమాజీగూడలోని ది పార్క్ హోటల్లోని ప్రైడ్ ఇండియా అవార్డ్స్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ వేడుకలో విద్య, ఆరోగ్యం, వ్యాపారం, నూతన ఆవిష్కరణలు, సంస్కృతి వంటి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థలను అవార్డులతో గౌరవించారు. పర్యావరణ పరిరక్షణకు చంద్రశేఖర శర్మ చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు వరించింది. పర్యావరణంపై తెలుగుప్రభ దినపత్రికలో వార్తలు, కథనాలకు ఆయన విశేష కవరేజీ అందిస్తున్నారు.
ఈ ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ ప్రధానోత్సవానికి దక్షిణాది నటి కావ్యా థాపర్, నారీ పురస్కార్ గ్రహీత కె. రాధాదేవి, జియోలాజిస్ట్, సేక్రెడ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డా. వాసుదేవ్ వీ.ఎన్. ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు అవార్డులను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా నటి కావ్యా థాపర్ మాట్లాడుతూ, “ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ 2025లో పాలుపంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. వివిధ రంగాల్లో ప్రతిభను చాటుతూ, సమాజం కోసం తమ వంతు కృషి చేస్తున్న వారిని గుర్తించి గౌరవించడం ఎంతో స్ఫూర్తిదాయకం” అని అన్నారు.
ప్రైడ్ ఇండియా అవార్డ్స్ వ్యవస్థాపకులు వినాయకుమార్ నారాయణస్వామి మాట్లాడుతూ, “ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ ప్రారంభించినప్పుడు, వెలుగులోకి రాని గొప్ప వ్యక్తులను గౌరవించాలన్నది మా లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా గొప్ప నాయకత్వాన్ని, మార్పును ప్రతిబింబించే వేదికగా ఎదిగింది” అని పేర్కొన్నారు. ఈ ఎడిషన్లో 120 మందికి అవార్డులను అందజేశామని, హైదరాబాద్లో నిర్వహించిన ఈ 2025 ఎడిషన్ మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని ఆయన తెలిపారు. సమగ్రత (ఇంటిగ్రిటీ), ఆవిష్కరణ (ఇన్నోవేషన్), ప్రభావం (ఇంపాక్ట్)తో ముందుకు తీసుకెళ్లే వారిని గుర్తించి, గౌరవించడం తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.