Saturday, July 27, 2024
Homeపాలిటిక్స్Jagan in Madanapalli sabha: బహిరంగ సభలో నిప్పులు చెరుగుతూ సాగిన జగన్...

Jagan in Madanapalli sabha: బహిరంగ సభలో నిప్పులు చెరుగుతూ సాగిన జగన్ ప్రసంగం

రెండోసారి నేను రెడీ, మీరు రెడీనా?

నా ఆత్మబంధువుల జనసముద్రమంటూ ..అన్నమయ్య జిల్లాలో మదనపల్లెలో ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న అభిమానం.. ఒక జనసముద్రాన్ని తలపిస్తోందని జగన్ అన్నారు.

- Advertisement -

జగన్ మాటల్లో..

మనందరి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఇంటింటికీ చేసిన మంచికి మద్దతు పలుకుతూ మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమరయోధుల సముద్రం ఇదీ అని చెప్పి ఇక్కడి నుంచి చూస్తుంటే కనిపిస్తోంది. ఇంటింటి నుంచి తరలి మదనపల్లె వచ్చిన నా ఆత్మబంధువుల జనసముద్రం ఇది. నా ఆత్మబంధువులైన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా అవ్వా తాతలకు, మీ అందరికీ కూడా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులూ జోడించి పేరు పేరునా ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.

పేదల పక్షాన ఒక గొప్ప గెలుపు
ఈ చిరునవ్వుల మధ్య మీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే గుండె నిండా చాలా సంతోషంగా ఉంది. మీ ఉత్సాహం చూస్తుంటే మరో ఆరు వారాల్లోపే జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షాన.. పేదల భవిష్యత్‌ కోసం ఒక గొప్ప గెలుపు కళ్ల ఎదుటే కనపడుతోంది.

గెలుపు కోసం యుద్ధంలో నేను సిద్ధం.. మీరు సిద్ధమా ?
మరి పేదల భవిష్యత్‌ కోసం జరగబోయే ఈ యుద్ధంలో.. గెలుపు కోసం.. నేను సిద్ధం. మరి మీరంతా కూడా.. సిద్ధమేనా అని అడుగుతున్నాను. ఇంటింటి అభివృద్ధిని, ప్రతి ఊరి అభివృద్ధిని, సామాజికవర్గాల అభ్యున్నతిని, అక్కచెల్లెమ్మల సాధికారతను, అవ్వాతాతల సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు, కొనసాగించేందుకు మీరంతా కూడా.. సిద్ధమేనా అని అడుగుతున్నాను. ఇంటింటికీ మంచి చేశాం.

డబుల్‌ సెంచరీ కొడతాం..
ప్రతి గ్రామానికీ మంచి చేశాం. చేసిన ఆ మంచిని ప్రతి గడపకూ వివరించి 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు.. ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీల్లేదు. డబుల్‌ సెంచరీ కొట్టేందుకు.. 200కు 200 కొట్టేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను.

మేనిఫెస్టోను 99శాతం అమలు చేసి… ప్రజలముందుకు వచ్చాం.
2019లో దేవుడు, మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ, మేనిఫెస్టోను ఒక బైబిల్‌ గా, ఖురాన్‌ గా, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన తర్వాత మళ్లీ ప్రజల ముందుకు ఓటు అడగడానికి అడుగులు వేస్తున్న ప్రభుత్వం. ఈ 58 నెలల పాలనలో విశ్వసనీయతకు ఇదీ అర్థం అని చెబుతూ అడుగులు వేశాం. 5 ఏళ్లు.. మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత ఇవాళ మళ్లీ మీ ముందు నిలబడి ఇంత మంచి చేశాం అని సగర్వంగా, సవినయంగా చెప్పగలుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో అయినా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలుగానీ, మన పార్టీ నాయకులుగానీ మన అభిమానులుగానీ, మన వాలంటీర్లు గానీ.. ప్రతి ఇంటికీ వెళ్లి గడచిన ఈ 58 నెలల్లో ఇంటింటికీ మీకు మంచి జరిగి ఉంటే.. మీ జగన్‌కు, మీ బిడ్డకు, మన ప్రభుత్వానికి, వైయస్సార్‌ సీపీ ప్రభుత్వానికి అండగా, తోడుగా నిలబడండి అని ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి గడపకూ వెళ్లి అడగగలుగుతున్నారంటే.. దానికి కారణం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంటింటికీ ప్రతి గ్రామానికీ మంచి చేయగలిగాం కాబట్టే అని ఈ సందర్భంగా సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నాను.

ప్రతిపక్షాలు – జెండాలు జత కట్టిన తోడేళ్లు గుంపు
ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా విడివిడిగా రాలేకపోతున్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ కూడా లేదు. అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి.. అబద్ధాలతో వస్తున్నారు. జెండాలు జతకట్టడమే వారి పని. ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్‌ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెబుతున్నాను.

ఈరోజు నేను చెబుతున్నాను. ఇంత మంచి జరిగింది కాబట్టి ప్రతి గుండెలోనూ మీ బిడ్డ ఉన్నాడు. మన వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం ఉంది. అందుకే ఈరోజున ఒక్కడి మీద ఎంత మంది దాడి చేస్తున్నారో చూడండి. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్‌.. వీళ్లందరికీ తోడు కుట్రలు, కుతంత్రాలతో ఈరోజు రాజకీయాలు కేవలం ఈ ఒక్క జగన్‌ కోసం, ఒక్క జగన్‌ ను వ్యతిరేకించడం కోసం ఇంత మంది ఏకమవుతున్నారంటే ఆలోచన చేయమని అడుగుతున్నాను.

మీ జగనే కనుక ప్రతి ఇంటికీ మంచి చేయకపోయి ఉంటే, మీ జగనే కనుక మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీనీ నెరవేర్చకపోయి ఉంటే మరి ఇంత మంది తోడేళ్లు, ఇన్ని కుట్రలు, ఇన్ని మోసాలు, ఇన్ని జెండాలు జతకట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంత మంది వస్తున్న పరిస్థితికి కారణం ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతున్నాను.

99 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధి పరీక్షలకు భయపడతాడా?
కానీ వాళ్లందరికీ తెలియని విషయం ఒకటుంది. ఇంత మంది జతకట్టి వచ్చినా కూడా వాళ్లందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్‌ పరీక్షలకు భయపడతాడా? అని అడుగుతున్నాను. అటువైపున గతంలో వాళ్లు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్‌.. పరీక్ష పాసవుతాడా? అని అడుగుతున్నాను.

ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్‌ గా, ఖురాన్‌ గా, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10 శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో ఎప్పుడూ నెరవేర్చని, మోసం చేసిన బాబు, ఆయన కూటమి నిలబడగలుగుతుందా? అని అడుగుతున్నాను.

ఈ విలువలు లేని వారిని చూసి భయపడతారా?
విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా ఇలాంటి పొత్తులను చూసి మన అభిమానులుగానీ, మన పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలుగానీ, వాలంటీర్లు గానీ, ఇంటింటా అభివృద్ధి అందుకున్న ఆ పేద వర్గాలుగానీ.. వీరిలో ఏ ఒక్కరైనా కూడా భయపడతారా అని అడుగుతున్నాను. భయపడరు.. పైగా ఒకే ఒక్క సమాధానం.. మేమంతా సిద్ధం.. అనిచెబుతున్నాను . 5 ఏళ్ల తర్వాత 58 నెలల పాలన తర్వాత జరుగుతున్న ఈ యుద్ధానికి మనమంతా కూడా ఇంతగా ఎలా సిద్ధమయ్యాము అంటే.. దానికి కారణం ఇంటింటికీ అందితేనే అది సంక్షేమం అని చూపించాం కాబట్టి.

మంచి చేయడం అంటే ఇదీ అని చూపించాం
గ్రామానికి మంచి చేయడం అంటే ఇదీ అని చేసి చూపించాం. మంచి చేసే ప్రక్రియలో ఎక్కడా కూడా కులం చూడలేదు. మతం చూడలేదు. రాజకీయాలు చూడలేదు. చివరకు వారు మనకు గతగ ఎన్నికల్లో ఓటు వేయకపోయినా పర్వాలేదు. వాళ్లకు అర్హత ఉంటే చాలు. వాళ్లకు జరగాల్సిన మంచి కచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి.. వాళ్లకు సైతం మంచి చేశాం.

ఇవాళ నేను చెబుతున్నాను. ప్రతి ఒక్కరికీ ఇలా మేలు చేయగలిగాం కాబట్టే.. ఇంతకు ముందు రాజకీయాల్లో ఎప్పుడూ కూడా జరగని విధంగా చేయగలిగాం కాబట్టే, ఇంతకు ముందు రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా చేయలిగాం కాబట్టే.. ఈరోజు మనకు మాత్రమే ఇంటింటికీ వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు ఒక్క వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను.

టీడీపీకి ఓటు వేసిన వారికీ మంచి చేశాం
గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారిని కూడా గత ప్రభుత్వం మీకు ఏమి చేసింది అని అడిగి.. వారిని కూడా మనం ఏం మంచి చేశామో కూడా వాళ్లకు చూపించి, వారి మనసు తట్టి, వారి గుండెను గెలిచి, ఫ్యానుకు ఓటు వేస్తేనే ఈ పథకాలన్నీ జగన్‌ సీఎంగా ఉంటేనే కొనసాగుతాయని చెప్పే నైతికత మనకుమాత్రమే ఉందని ఈ సందర్భంగా సగర్వంగా చెబుతున్నాను.

175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలతో మళ్లీ మనందరి ప్రభుత్వమే ఎందుకు రావాలి అంటే మన అక్కచెల్లెమ్మలను ఈ 5 ఏళ్ల మాదిరిగానే వచ్చే 5 ఏళ్లు కూడా ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి మళ్లీ మనందరి ప్రభుత్వమే రావాలి. కుటుంబానికి ఆ అక్కచెల్లెమ్మలు, వారిని మూలంగా, బలమైన శక్తిగా నిలబెట్టే ప్రక్రియ కొనసాగించాలనే లక్ష్యంతో మళ్లీ అధికారం అడుగుతున్నాం. వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్‌ నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా కనీసం ఆలోచనకు రాని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం.

5 ఏళ్లలో డీబీటీ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు
గడచిన 5 ఏళ్లలో వివిధ పథకాల కోసం ఈ రకంగా బటన్‌ నొక్కి నేరుగా డీబీటీ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు అయితే, నాన్‌ డీబీటీ కూడా కలిపితే, అంటే నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు, వారి పిల్లలకు పెట్టే గోరుముద్ద, ట్యాబులు, విద్యా కానుక లాంటివి కలుపుకొంటే అది దాదాపుగా రూ.1లక్ష కోట్లు. మొత్తంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాలా నా అక్కచెల్లెమ్మలకుటుంబాల ఖాతాలకు రూ.3.70 లక్షల కోట్ల పైచిలుకు పంపించాం. ఒక్క రూపాయి ఎక్కడా అవినీతి లేదు. లంచం లేదు. దోపిడీ లేదు. కమీషన్‌ లేదు. ఇదీ మనం చేసిన మన ట్రాక్‌ రికార్డు.

బాబు పేరు చెబితే ఒక్క మంచీ గుర్తుకురాదు
అదే చంద్రబాబు పేరు చెబితే.. ఆయన చేసిన ఏ మంచీ గుర్తుకు రాదు. ఆయన చేసిన ఏ స్కీమూ గుర్తుకు రాదు. అదే మీ జగన్‌ పేరు చెబితే.. ఏం గుర్తుకొస్తుందో మీరే చూడండి. మీ గ్రామాల్లోనే మీ వార్డులోనే విలేజ్‌ సెక్రటేరియట్‌. వార్డు సెక్రటేరియట్‌. అంటే మీ జగన్‌. అందులో దాదాపుగా 10 మంది శాశ్వత ఉద్యోగాలు మన పిల్లలే అక్కడ చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తున్నారంటే మీ జగన్‌. ఇంటికే వచ్చే వాలంటీర్లు అందించే పెన్షన్‌ అంటే మీ జగన్‌. లంచాలు, వివక్ష లేని పాలన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. బటన్‌ నొక్కడం నేరుగా రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపింది ఎవరంటే మీ జగన్‌. మీ ఊరికే విలేజ్‌ క్లినిక్, మీ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఉచితంగా మందులు, ట్యాబ్లెట్లు, ఉచితంగా టెస్టులు.. అంటే మీ జగన్‌ గుర్తుకొస్తాడు.

గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీషు మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. ఆ గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీషు మీడియంతో మొదలు ప్రపంచ స్థాయి చదువులు, ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు, 6వ తరగతి నుచి ప్రతి గవర్నమెంట్‌ స్కూలు, క్లాసు రూపులో డిజిటల్‌ బోధన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. రైతన్నలకు రైతు భరోసా, గ్రామంలోనే ఆర్బీకే, రైతన్నలకు సున్నా వడ్డీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్‌ పుట్‌ సబ్సిడీ అంటే.. గుర్తుకొచ్చేది మీ జగన్‌.

35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు బటన్‌ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్లిపోవడం, ఇందులో 75 శాతం పైచిలుకు ఈ వర్గాలకు, నా వర్గాలకు ఇచ్చింది ఎవరంటే మీ జగన్‌. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రం మొత్తం మీద మనం వచ్చేదాకా, 4 లక్షల ఉద్యోగాలుంటే, ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది ఎవరంటే మీ జగన్‌. అందులో 80 శాతం ఉద్యోగాలు నేను నా..నా..నా..నా. అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా తమ్ముళ్లు, నా చెల్లెమ్మలే అందులో ఉద్యోగస్తులుగా ఉన్నారంటే.. జరిగింది ఎప్పుడంటే, చేసింది ఎప్పుడంటే, గుర్తుకొచ్చేది ఎవరంటే మీ జగన్‌.

అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం..
అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఇచ్చింది ఎవరంటే, జరిగింది ఎప్పడంటే, చేసింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఎప్పుడూ జరగని విధంగా వేగంగా జరుగుతోందంటే మీ జగన్‌. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చూడని విధంగా, జరగని విధంగా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ, అండగా ఉంటూ ఎప్పుడూ ఊహించని విధంగా ఓ అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, షాదీ తోఫా.. పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. మహిళా సాధికారత, దిశ యాప్, ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉందంటే.. గుర్తుకొచ్చేది మీ జగన్‌. ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రతి జిల్లాలోనూ వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి.

కొత్తగా సీ పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం..
రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా కొత్తగా 4 సీ పోర్టులు కడుతున్నాం. కొత్తగా మరో 10 ఫిషింగ్‌ హార్బర్లు కడుతున్నాం. ఎయిర్‌ పోర్టులు, వాటి విస్తరణ వేగంగా జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ ఎవరూ వినని పేర్లు ఈరోజు రాష్ట్రంలోకి అడుగులు వేస్తున్నాయంటే ఇవన్నీ జరిగినది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా, మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలోనే జరిగాయి అని గర్వంగా చెబుతున్నాను.

చంద్రబాబు పేదల రక్తం పీల్చే పశుపుపతి
మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది. ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడదామా వద్దా?
ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం.

ఆ ముఠా నాయకుడు ఆయన పేరు నారా చంద్రబాబునాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూశారా? ఆ అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాళీ వదల.. వదల బొమ్మాళీ వదల.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడుతున్నాడు ఈ పశుపుపతి.

ఈ పశుపుపతి ప్లాష్‌ బ్యాక్‌ చూస్తే…
నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు ఈ వదల బొమ్మాళీ గురించి, ఈ పశుపుపతి గురించి 2014లో ఏం జరిగిందన్నది ఒక్కసారి ఫ్లాష్‌ బ్యాక్‌ లోకి ఒకసారి వెళ్దామా? 5 ఏళ్ల ఆయన పాలన, 2014లో మొదలైన ఆయన పాలన, ఈ పశుపుపతి గురించి, ఈ వదల బొమ్మాళీ గురించి పోయి చూస్తే, 2014లో ఈ పశుపుపతి ఇదే మాదిరిగా మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు. ఈ మూడు పార్టీలూ కలిసి ఇంటింటికీ తన ముఖ్యమైన హామీలు అంటూ ఇంటింటికీ కూడా తాను ఈ మాదిరిగా పాంప్లేట్‌ పంపించాడు. ఈ ఫొటోలన్నీ గుర్తున్నాయా? 2014లో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారు. వీళ్లు ముగ్గురూ కలిసి కింద చంద్రబాబు నాయుడు సంతకం. కనిపిస్తోందా? ఈ పాంప్లేట్‌ ఇంటింటికీ పంపించాడు. ముఖ్యమైన హామీలు అని.. ఇప్పుడు కూడా చెబుతున్నాడు కదా సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అని. అప్పట్లో ముఖ్యమైన హామీలివి. ఇదే చంద్రబాబు ఇంటింటికీ పంపించాడు.

2014లో బాబు ప్రచార హోరు చూస్తే…
ఇంటింటికీ పంపించడంలో సరిపుచ్చుకోలేదు. 2014 మీకు గుర్తుందా. ఇంటికెళ్లీ టీవీ ఆన్‌ చేస్తే చాలు, ఈనాడు పేపర్‌ గానీ, ఆంధ్రజ్యోతి పేపర్‌ గానీ, టీవీ5 గానీ చూస్తే చాలు.. అడ్వటైజ్‌ మెంట్లతో హోరెత్తించారు. ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒక్కసారి చెబుతా. విందామా?

బాబు విఫల హామీలు….
రైతులకు రుణ మాఫీ. ముఖ్యమైన హామీ. రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. అడుగుతున్నా. రూ.87612 కోట్లు రుణ మాఫీ చేశాడా అని అడుగుతున్నాను.
మరో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు అన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. రూ.14205 కోట్లు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు. అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతున్నాను. మరో ముఖ్యమైన హామీ.. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్‌ చేస్తామన్నాడు. ఒక్కరికన్నా.. ఒక్క రూపాయి అయినా.. డిపాజిట్‌ చేశాడా అని మిమ్మల్నందరినీ అడుగుతున్నాను.

ఇప్పుడు సూపర్‌ సిక్స్‌…
మరో ముఖ్యమైన హామీ. ఇప్పుడు సూపర్‌ సిక్సు, సూపర్‌ సెవెన్‌ అంటున్నాడు కదా.. అప్పటి ముఖ్యమైన హామీలు ఇవి. ఇంటింటికీ ఉద్యోగమిస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నాడు. 5 ఏళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే… ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు. ముఖ్యమైన హామీ ఇది. ఇంటింటికీ ఈ సంతకం పెట్టి ముగ్గురి ఫొటోలతో పంపిన ముఖ్యమైన హామీ. రూ.1.20 లక్షలు ముట్టిందా అని అడుగుతున్నాను.

మరో ముఖ్యమైన హామీ.. అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం. కట్టుకునేందుకు పక్కా ఇళ్లు. ముఖ్యమైన హామీ ఇది. ఇంటింటికీ పంపించిన పాంప్లేట్‌ ఇది. చంద్రబాబు సంతకం పెట్టిన పాంప్లేట్‌. పక్కనే దత్తపుత్రుడి ఫొటో, పక్కనే మోడీ గారి ఫొటో. కనీసం ఒక్కరికన్నా.. ఒక్క సెంటు స్థలం అయినా గానీ ఇచ్చాడా అని మిమ్మల్నందరినీ అడుగుతున్నాను.

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాలన్నీ మాఫీ అన్నాడు. చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ మించి అభివృద్ధి చేస్తాడంట. అన్నాడబ్బా.. ఇది కూడా ముఖ్యమైన హామీ. ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన మదనపల్లెలో నిర్మించాడా? ఏమన్నా కనిపించిందా?

ఇవీ ముఖ్యమైన హామీలు. ఇక ముఖ్యమైన హామీలు వద్దనుకుంటే ఆయన మేనిఫెస్టో చూస్తే ఇటువంటివి 650 హామీలు కనిపిస్తాయి. ముఖ్యమైన హామీల పరిస్థితే ఇది అంటే.. ఇక మేనిఫెస్టో కథ దేవుడెరుగు. అది ఎవరికీ కనపడదు. ఎన్నికలు అయిపోతే చెత్తబుట్టలో పడేస్తారు. జరిగింది అదీ. మరి ఈ పాంప్లేట్‌ లో చెప్పిన ఈ ముఖ్యమైన హామీలు, ఆ ముగ్గురి ఫొటోలతో ఇచ్చిన ఈ ముఖ్యమైన హామీలు 2014లో ఇంటింటికీ పంపి మరీ ఈ ముఖ్యమైన హామీలు ఇచ్చిన ఈ చంద్రబాబు ఇచ్చిన ఈ దత్తపుత్రుడు, ఇచ్చిన ఇదే మోడీ గారు.. ముగ్గురి ఫొటోలూ పెట్టి చంద్రబాబుసంతకం పెట్టి ఇంటింటికీ పంపించిన పాంప్లేట్‌. నేను అడుగుతున్నాను. వీళ్లు ముగ్గురూ కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ ముఖ్యమైన హామీలంటూ ఈ పాంప్లేట్‌ లో పంపించిన ఈ హామీల్లో కనీసం ఒక్కటైనా నెరవేర్చారా? అని అడుగుతున్నాను. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నాను.

మరలా ఇప్పుడు ఇదే పొత్తు… ఇదే ముగ్గురు.. ఇదే పార్టీలు. మరి ఇదే పొత్తు. ఇదే ముగ్గురు, ఇదే పార్టీలు. మరోసారి ఈముగ్గురి కూటమి.. గతంలో ఇచ్చిన హామీలు ఏవీ కూడా అమలు చేయకుండా మరోసారి ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి, మరో మేనిఫెస్టో అంటూ రంగురంగుల వాగ్దానాలు ముగ్గురి ఫొటోలు వేసి, సంతకాలు పెట్టి ఇంటింటికీ పంపినట్టుగానే మరోసారి ఇదే డ్రామా. 2014 కంటే ఇంకా ఎక్కువ హామీలిస్తూమరోసారి మోసం చేసేందుకు, మరో మేనిఫెస్టోతో ఇంకో డ్రామాకు తెరతీస్తున్నారు. మళ్లీ ఇదే ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్‌ కారు కొనిస్తామంటున్నారు. మళ్లీ ఇదే ముగ్గురు కలిసి సూపర్‌ సిక్స్‌ అంటున్నారు. సూపర్‌ సెవెన్‌ అంటున్నారు. మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను.

మరి వదల బొమ్మాళీ అంటూ మళ్లీ పేదల రక్తం పీల్చేందుకు ఈ పశుపుపతిని ఏ ఒక్కరైనా కూడా నమ్మవచ్చా అని మిమ్మల్నందరినీ అడుగుతున్నాను. నమ్మిన వారిని నట్టేట ముంచి అధికారం ఎలాగైనా దక్కించుకోవాలని, మరోసారి మన రాష్ట్రాన్ని దోచుకోవాలని బాబు ప్లాన్‌. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ మనిషికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు. ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కాదు. కేవలం వీళ్లకు అధికారం కావాల్సింది దోచుకోవడం కోసం, దోచుకున్నది పంచుకోవడం కోసం. దీనికి వీళ్లకు అధికారం కావాలి. మరి ఇలాంటి బాబును ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా, వద్దా అని అడుగుతున్నాను. గవర్నమెంట్‌ బడిలో ఇంగ్లీషు మీడియం వద్దన్న వారికి బద్ధి చెప్పాలా వద్దా? పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టుకు వెళ్లీ కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

ఎస్సీలను అవమానించిన పార్టీకి చరమగీతం పాడాలి
ఎస్సీలుగా పుట్టాలని ఎవరనుకుంటారని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడండి అని ఈ సందర్భంగా మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను. బీసీల తోకలు కత్తిరిస్తానన్న ఇదే చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తున్న తోకను.. వీరందరినీ కూడా వీరి తోకలు కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని కోరుతున్నాను. నాన్నగారు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్‌ తోనూ, మైనార్టీల మనోభావాలతోనూ గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న ఈ చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో ఈ కూటమికి 30 చెరువుల నీళ్లు తాగించండి అని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను.

నిజమైన సామాజిక న్యాయానికి…
నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టే రాబోయే రోజుల్లో పేదలకు,పెత్తంగార్లకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో తెలుసా? ప్రజలకు మంచి చేసిన ఫ్యాను.. మీ ఇంట్లోనే ఉంటుంది. అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీని గటగటా తాగేసి తన వారిని తాకట్టుపెట్టిన గ్లాసు సింక్‌ లోనే ఉంటుంది. ఫ్యాన్‌ ఇంట్లోనే ఉంటుంది. సైకిల్‌ ఇంటి బయటే ఉంటుంది. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌ లోనే ఉంటుంది. ఇదీ ప్రజల మాట. ఆ పొత్తుల, ఆ ఎత్తుల, జిత్తుల ముఠా ఎన్ని చేసినా, ఏమిచెప్పినా ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒక్కటే ఒక్కటి. మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు. ఈ ఓటు మన భవిష్యత్తును, మన తలరాతలు ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మళ్లీ అన్నను తెచ్చుకుందాం. అన్నే రావాలి. ఈ 5 ఏళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు, పేదవాడి భవిష్యత్‌ బాగు పడటానికి, మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడటానికి, మళ్లీ అన్నే రావాలి అని ప్రతి ఒక్కరికీ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి.

పెన్షన్లు ఆపించిన బాబు….
మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ చూశారు కదా.. చివరికి చంద్రబాబు ఎంత స్థాయికి దిగజారిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా.. లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్‌ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెలనెలా 1వ తారీఖున ఇంటికే వచ్చి, సూర్యోదయానికంటే మునుపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్‌ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతున్న వాలంటీర్లను ఏప్రిల్‌ 1వ తారీఖు నుంచి పెన్షన్‌ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్‌ కు చంద్రబాబు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. పేదలంటే ఈ చంద్రబాబుకు ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను.

66 లక్షల మంది పేదలకు నష్టం చేయించిన బాబు….
చంద్రబాబునాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్‌ చేత తానే ఫిర్యాదు చేయించి అది ఎవరి మీద చేయించాడో తెలుసా? జగన్‌ మీద కాదు.. జగన్‌ ను నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయలేదు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నా కూడా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. పేదవాడికి నష్టం జరుగుతోంది. అవ్వలకు నష్టం జరుగుతోంది. నడవలేని వయసులో ఉన్న ఆ అవ్వలకు చేతనైతే ఇంటికెళ్లి తోడుగా ఇప్పించే కార్యక్రమంలో శభాష్‌ అని చెప్పాల్సింది పోయి.. ఆ వాలంటీర్‌ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారంటే ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను.

ఇలానే గతంలో పేదలు వెళ్లి గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీషు మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబునాయుడు గారు. పేద పిల్లలకు మీ జగనన్న ట్యాబులిస్తుంటే కూడా ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు గతంలో. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కూడా ఇదే మాదిరిగా కోర్టుల్లో కేసు వేయించి వ్యతిరేకించాడు గతంలో. ఇప్పుడు చివరికి అవ్వాతాతలకు అందించే పెన్షన్‌ ను కూడా ఇంటింటికీ రాకుండా అడ్డు తగులుతున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఇదంతా కూడా పెత్తందారీ భావజాలం కాదా అని అడుగుతున్నాను.

ఇలాంటి పెత్తందార్లను, ఇలాంటి పేదల వ్యతిరేకులకు, ఇలాంటి వారికి ఏ ఒక్కరైనా పొరపాటున ఓటు వేస్తే దాని అర్థం ఏమిటో తెలుసా? తమ పెన్షన్లు, తమకు అందే స్కీములు, ఇంటింటికీ వచ్చి ఇచ్చి పోయే వాలంటీర్‌ వ్యవస్థను సైతం అన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే చంద్రబాబునాయుడు గారికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ చంద్రబాబునాయుడు గారికి ఓటు వేసినట్లే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని చెప్పి, మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి అని తెలియజేస్తున్నాను.

మీ అందరికీ ఒకటే చెబుతున్నాను
పేదలకు అందాల్సిన ప్రతి ఒక్క రూపాయీ, ఏదీ ఆగకూడదంటే, మీ పెన్షన్‌ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికే రావాలి అంటే గత 5 ఏళ్ల మాదిరిగా అదే పెన్షన్‌ సొమ్ము మీరు పొందాలి అంటే బాబు లాంటి సైంధవులను ఎప్పటికీ అడ్డు పడే పరిస్థితి, అవకాశం ఇవ్వకూడదు. అది జరగాలి అంటే మరో 40 రోజుల్లో రెండు బటన్లు ప్రతి పేదవాడూ నొక్కాలి. ఆ పేదవాళ్ల కోసం నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు. ఆ పేదవాళ్లందరూ, అక్కచెల్లెమ్మలందరూ ఏకమై కేవలం రెండే రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. ఫ్యాను మీద నొక్కితేనే ఈ వదల బొమ్మాళ్లీ ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. అందుకేనేను మళ్లీ చెబుతున్నా. మనం వేసే ఈ ఓటుకేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు. ఈ ఓటు వల్ల మీ భవిష్యత్, ఈ ఓటు వల్ల మీ పిల్లల భవిష్యత్, మీ ఇంట్లో ఆడపడుచుల భవిష్యత్, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతల భవిష్యత్‌ అంతా కూడా ఈ ఓటు మీద ఆధారపడి ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతున్నాను.

మన ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందాం
జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే, జరుగుతున్న ఈ మంచి అంతా కూడా మళ్లీ కొనసాగుతుంది. మళ్లీ వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి నేరుగా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటారు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఎన్నికల సంగ్రామం జరగబోతోంది. జగరబోయే ఈ సంగ్రామంలో అబద్ధాన్ని, మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమా అని అడుగుతున్నాను. జరగబోయే ఈ ఎన్నికల సంగ్రామంలో అబద్ధానికి, మోసానికి వాళ్లు ప్రతినిధులు అయితే, విలువలకు, విశ్వసనీయతకు మనం ప్రతినిధులం. ఈ విలువలు కాపాడుతూ, విశ్వసనీయతకు తోడుగా ఉంటూ మీలో ఉన్న ప్రతి ఒక్కరూ సిద్ధం అయితే, జేబులోంచి అందరూ సెల్‌ ఫోన్లు బయటకు తీయండి. అందులో ఉన్న టార్చ్‌ లైట్‌ బటన్‌ ఆన్‌ చేయండి. పేదల వ్యతిరేకులకు వ్యతిరేకంగా, పేదలకు భరోసాగా, తోడుగా మేమంతా కూడా యుద్ధానికి సిద్ధం అని గట్టిగా పిలుపునివ్వండి.

మంచి జరిగిస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు, ప్రజల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, మరో రెండు నెలల్లోనే మళ్లీ మీ బిడ్డ మళ్లీ వచ్చి మళ్లీ మీకు ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా ఆ దేవుడిని కోరుకుంటూ మీ చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకునే ముందు.. ఈరోజు మీ జిల్లాకు సంబంధించి మన పార్టీ తరఫున నిలబడబోతున్న అభ్యర్థులను ఒక్కసారి మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను.

మన అభ్యర్ధులకు మీ చల్లని దీవెనలు అందించండి
మీ అందరి చల్లని దీవెనలను, మీ అందరి చల్లని ఆశీస్సులు మన పార్టీ తరఫున నిలబడబోతున్న ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఎంపీ అభ్యర్థిగా మిధున్‌ నిలబడుతున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరికీ పరిచయస్తుడు. మంచి వాడు. మీ అందరి చల్లని దీవెనలను మిధున్‌ పై ఉంచవలసిందిగా మీ అందరినీ సవినయంగా వేడుకుంటున్నాను. అదే విధంగా కోడూరు నుంచి శ్రీను నిలబడుతున్నాడు. ఈసారి శీను 5వ సారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తున్నాడు. నిజంగా మంచి వాడు కాబట్టే ఇలా తాను 5వ సారి గెలవగలిగే పరిస్థితిలో పోటీ చేస్తున్నాడు. మీ అందరి చల్లని దీవెనలను, మీ అందరి చల్లని ఆశీస్సులు శీనుపై ఉంచవలసిందిగా కోరుతున్నాను. రాయచోటి నుంచి శ్రీకాంత్‌ నిలబడుతున్నాడు. తానుకూడా ఎమ్మెల్యే అని చెప్పడం కన్నా నాకు మంచి స్నేహితుడు అని చెప్పొచ్చు. మీ అందరి చల్లని దీవెనలను, మీ అందరి చల్లని ఆశీస్సులు శ్రీకాంత్‌ పై కూడా ఎప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. రాజంపేట నుంచి అమర్‌ అన్న నిలబడుతున్నాడు. అమర్‌ అన్ననున ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ల పెదాల మీద ఉంటుంది. మంచి వాడు, సౌమ్యుడు, మాట ఇస్తే మాట మీద నిలబడతాడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అమరన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను.

తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి ద్వారక అన్న నిలబడుతున్నాడు. మంచి వాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ద్వారకన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. ఇక మదనపల్లె నుంచి మీ వాడు. అతి సామాన్యుడు. కేవలం ఒక ఉద్యోగస్తుడు. మీలో ఒకడు. నిస్సార్‌ అహ్మద్‌ అన్న. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నిస్సార్‌ అహ్మద్‌ అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను, కోరుతున్నాను. పీలేరు నుంచి రామచంద్ర అన్న నిలబడుతున్నాడు. మీ అందరికీ పరిచయస్తుడే. ఎందుకంటే చాలా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు, రామచంద్రారెడ్డి అన్నపై ఉంచాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డి అన్న నిలబడుతున్నాడు. నాకు పిత్రు సమానుడు. మీ అందరికీ పరిచయస్తుడు. మంచి వాడు సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రామచంద్రారెడ్డి అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను.

మన గుర్తు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడో అక్కడో ఎవరో మర్చిపోయి ఉంటే మాత్రం.. మన గుర్తు ఫ్యాను అని గుర్తుపెట్టుకోండి. చాలా కుట్రలు జరుగుతున్నాయి. కుతంత్రాలు జరుగుతున్నాయన్నది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మోసాలు చేస్తున్నారు. చాలా అబద్ధాలు చెబుతున్నారని కూడా గుర్తుపెట్టుకోండి. వీటన్నింటిని కూడా అధిగమించి ఫ్యాను గుర్తుకు కచ్చితంగా రెండు బటన్లు వేయాలి అన్నది కచ్చితంగా గుర్తుపెట్టుకోమని, ఫ్యానుకు వేస్తేనే మన భవిష్యత్తు, మన తలరాతలు బాగుపడతాయన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగండి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులకు మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటూ సెలవు తీసుకుంటున్నాను. చీకటి అయిపోయింది కాబట్టి ర్యాంప్‌ మీద నడిచే కార్యక్రమం సెక్యూరిటీ వాళ్లు చీకట్లో వద్దు అని సలహా ఇస్తున్నారు కాబట్టి ఈసారి చేయలేకపోయిందుకు ఎవరూ కూడా మరోలా మరోలా భావించవద్దు అని కూడా తెలియజేస్తున్నాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News