IND vs ENG 1st Test: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట కొనసాగుతోంది. ఓవర్ నైట్ స్కోర్ 209/3 పరుగుల స్కోర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటోంది. లంచ్ బ్రేక్ సమయానికి 327/5 పరుగులు చేసింది. ప్రస్తుతం 144 పరుగులతో వెనకబడి ఉంది.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో పోప్ సెంచరీతో అదరగొట్టాడు. హ్యారీ బ్రూక్(57) ధాటిగా ఆడుతూ మరో హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 20 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. జేమీ స్మిత్ 29 పరుగులతో రాణించాడు. ఇక జో రూట్ 28, బెన్ డకెట్ 52 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లతో రాణించాడు. మహ్మద్ సిరాజ్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ తీశారు. లంచ్ బ్రేక్ తర్వాత భారత బౌలర్లు చకాచకా వికెట్లు తీస్తేనే విజయం దిశగా అడుగులు పడతాయి. లేదంటే మ్యాచ్ క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ను ధాటిగా ప్రారంభించాడు. రాహుల్(42) ఔట్ అనంతరం కెప్టెన్ శుభమన్ గిల్ తో కలిసి ధాటిగా ఆడాడు. ఇద్దరు కలిసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కులు చూపించారు. ఈ క్రమంలో సెంచరీ చేసుకున్న జైస్వాల్ 101 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. తర్వాత గిల్, రిషభ్ పంత్ ఇంగ్లీష్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. గిల్ 147 పరుగులు, పంత్ 134 పరుగులతో దుమ్మురేపారు. వీరిద్దరి ఔట్ అనంతరం 41 పరుగుల వ్యవధిలోనే ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.