ISRO Future missions 2040: ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న ఇస్రో… ఇప్పుడు ఏకంగా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని, ఉపగ్రహాల సంఖ్యను మూడు రెట్లు పెంచాలని కంకణం కట్టుకుంది. సేవలు అందించే సంస్థ స్థాయి నుంచి అంతరిక్ష వాణిజ్యంలోనూ అగ్రగామిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ అంబరమంత లక్ష్యాలను చేరుకోవడానికి ఇస్రో వేస్తున్న అడుగులేంటి..? మన అంతరిక్ష ప్రయాణం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది..?
భవిష్యత్ ప్రణాళిక ఇదే: హైదరాబాద్లో జరిగిన ‘భారత అంతరిక్ష కార్యక్రమం- విజయాలు, సవాళ్లు, భవిష్యత్ దృక్పథం’ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్, సంస్థ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు. ఈ వివరాలు ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉన్నాయి.
2035 నాటికి ‘భారత అంతరిక్ష కేంద్రం’: అంతరిక్షంలో భారత్కు శాశ్వత చిరునామా ఉండాలన్న లక్ష్యంతో, 2035 నాటికి పూర్తిస్థాయి అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన తొలి మాడ్యూల్ను 2028 నాటికే కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
ALSO READ: https://teluguprabha.net/technology-news/itel-super-guru-4g-max-launched-in-india/
ఉపగ్రహాల పెంపు: ప్రస్తుతం దేశసేవలో 55 ఉపగ్రహాలు ఉన్నాయని, వాటి అవసరం, డిమాండ్ భారీగా పెరిగిన నేపథ్యంలో, 2040 నాటికి ఈ సంఖ్యను మూడు రెట్లు పెంచాలని ఇస్రో నిర్ణయించింది.
గగన్యాన్కు డేట్ ఫిక్స్: భారతీయులను అంతరిక్షంలోకి పంపే ప్రతిష్ఠాత్మక ‘గగన్యాన్’ మిషన్ను 2027 మొదటి త్రైమాసికంలో చేపట్టాలని ఇస్రో భావిస్తోంది.
సేవ నుంచి వ్యాపారం వైపు: ఇప్పటివరకు కేవలం దేశానికి సేవలు అందించే మోడల్లో పనిచేసిన ఇస్రో, ఇకపై అంతరిక్ష వాణిజ్యంలోనూ తనదైన ముద్ర వేయనుంది. ఇందులో భాగంగా, రాబోయే 3 నెలల్లో అమెరికాకు చెందిన 6,500 కేజీల భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారత రాకెట్ల ద్వారా ప్రయోగించనుంది.
ALSO READ: https://teluguprabha.net/technology-news/honor-pad-x7-tablet-launched-in-global-market-arabia/
జపాన్తో ‘చంద్రయాన్-5’: చంద్రయాన్-3 అపూర్వ విజయంతో స్ఫూర్తి పొందిన జపాన్, చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్తో చేతులు కలిపింది. ఇస్రో, జపాన్ అంతరిక్ష సంస్థ (JAXA) సంయుక్తంగా ‘చంద్రయాన్-5/LUPEX’ మిషన్ను చేపట్టనున్నాయి. చంద్రయాన్-3 ల్యాండర్ బరువు 1,600 కేజీలు కాగా, ఈ కొత్త ల్యాండర్ ఏకంగా 6,600 కేజీల బరువుతో ఉండనుండటం విశేషం.
నింగిలోకి ‘నిసార్’: నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించిన ‘సింథటిక్ అపెర్చర్ రాడార్’ (NISAR) ఉపగ్రహాన్ని జులై 30న జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.
మూడో లాంచ్ప్యాడ్కు ఆమోదం: పెరుగుతున్న ప్రయోగాల దృష్ట్యా, శ్రీహరికోటలో రూ.4000 కోట్ల బడ్జెట్తో మూడో లాంచ్ప్యాడ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
“అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా 2040 నాటికి భారత్ అంతరిక్ష సాంకేతికతలో నిలుస్తుంది,” అని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లలో 34 దేశాలకు చెందిన 433 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో, ఇప్పుడు సొంత అంతరిక్ష కేంద్రం, మానవసహిత యాత్రలతో విశ్వంలో తన జైత్రయాత్రను కొనసాగించేందుకు సిద్ధమవుతోంది.


