Arrival Of Pod Taxi: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది, జనాభా పెరుగుదలతో పాటు మౌలిక వసతులపై భారం పెరుగుతోంది. ఐటీ, విద్య, వాణిజ్య రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 41వ స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ, నగరవాసులకు ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. ఈ రద్దీ, ట్రాఫిక్ జామ్ల కారణంగా ప్రజలు గంటల తరబడి రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు పరిష్కారంగా, హైదరాబాద్లో త్వరలో “పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్” (PRT) వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
పాడ్ ట్యాక్సీ ప్రత్యేకతలు:
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (UMTA) సంయుక్తంగా ఈ పాడ్ ట్యాక్సీల ప్రాజెక్టును చేపట్టనున్నాయి. పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ అనేది చిన్న, స్వయంచాలక కాప్స్యూల్ వాహనాల ద్వారా ప్రయాణించే ఒక నూతన రవాణా విధానం. ఈ ‘పాడ్స్’ డ్రైవర్ లేకుండానే బ్యాటరీ శక్తితో నడుస్తాయి. ఒక్కో పాడ్లో 4-6 మంది ప్రయాణికులు తమ లగేజీతో సహా సులభంగా ప్రయాణించవచ్చు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్గా పనిచేసే వ్యవస్థ. రోజుకు దాదాపు 2 లక్షల మంది ప్రయాణికుల అవసరాలను తీర్చగల సామర్థ్యం దీనికి ఉంది.
తొలి దశలో ప్రధాన మార్గాలు:
ఈ అధునాతన రవాణా విధానాన్ని తొలి దశలో రాయదుర్గ్ – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు కాచిగూడ – ఎయిర్పోర్ట్ మార్గాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఈ ప్రాంతాలు ఐటీ కంపెనీలకు కేంద్రంగా ఉండటం, నిత్యం రద్దీగా ఉండటం వల్ల ఈ మార్గాలను ఎంపిక చేశారు. ఈ పాడ్ ట్యాక్సీల ఏర్పాటుకు ప్రత్యేకంగా భూమిని సేకరించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న రోడ్ల పక్కనే ఎత్తైన రైలు మార్గాల మాదిరిగా వీటిని నిర్మించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించవచ్చు.
ట్రాఫిక్, వర్షాల కష్టాలకు విముక్తి:
వర్షాలు కురిసినప్పుడు ట్రాఫిక్ జామ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం వంటి సమస్యలతో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాడ్ ట్యాక్సీలు ఒక వినూత్న పరిష్కారంగా నిలవనున్నాయి. పాడ్ ట్యాక్సీలతో ప్రయాణికులు రద్దీని దాటుకుని వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారు. ఏటా 2.5-3 శాతం పెరుగుతున్న జనాభాతో, ట్రాఫిక్ నియంత్రణకు ఈ విధానం ఎంతో కీలకం. నగర అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ఈ పాడ్ ట్యాక్సీలు పర్యావరణ హితమైనవి కావడం తో పాటు, ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి.
ట్రాఫిక్ రద్దీ నుంచి విముక్తి పొందాలంటే కొత్త ఆలోచనలతో ముందుకు రావాల్సిందే. హైదరాబాద్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడుగు భాగ్యనగరానికి సాంకేతికతతో కూడిన స్మార్ట్ ప్రయాణ మార్గాన్ని సుగమం చేయనుంది. ట్రాఫిక్ కష్టాలతో సతమతమవుతున్న వారికి ఇది నిజంగానే శుభవార్త!


