CP Sajjanar Alert on Cyber Crime: సైబర్ మోసాల పట్ల హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి ప్రజలను అప్రమత్తం చేశారు. వాట్సప్లో డీపీగా తన ఫొటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు సజ్జనార్ ‘X వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి సందేశాలకు స్పందించవద్దని సూచించారు. ముఖం చూసి మోసపోవద్దని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఈ విషయంపై ప్రజలను ఎంత అప్రమత్తం చేసినా సైబర్ క్రైమ్ బాధితులు ఉంటూనే ఉన్నారు. సాధారణ ప్రజలను మొదలుకొని ఉన్నతాధికారుల పేర్ల సైతం వాడుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను దోచుకుంటున్నారు. వాట్సప్లో డీపీలుగా ప్రముఖ వ్యక్తుల ఫొటోలను పెట్టుకుని అత్యవసర పరిస్థితి ఉందంటూ సందేశాలు పంపించి డబ్బులు అడుగుతున్నారు. కొందరు నిజమే అనుకుని డబ్బులు పంపిస్తున్నారు. మరికొందరు ఇది మోసమని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సైబర్ నేరగాళ్లు సీపీ సజ్జనార్ పేరును సైతం వాడుకున్నారు.
వాట్సప్లో డీపీగా తన ఫొటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని సీపీ సజ్జనార్ తెలిపారు. ఇవి పూర్తిగా నకిలీ ఖాతాలు, మోసపూరితమైనవని పేర్కొన్నారు. ఇలాంటి సందేశాలకు స్పందించవద్దని.. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి పోలీసులకు రిపోర్ట్ చేయాలని సజ్జనార్ సూచించారు.
Also Read: https://teluguprabha.net/technology-news/pvc-aadhaar-card-download-with-easy-steps/
‘సైబర్ నేరగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలను అసలే ఇవ్వొద్దు. డబ్బులు అడిగితే పంపించొద్దు. సైబర్ మోసగాళ్లకు మీ జాగ్రత్తే అడ్డుకట్టనే విషయం మరచిపోవద్దు. నకిలీ వాట్సప్ ఖాతాలు మీ దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. అదేవిధంగా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.’ అని ప్రజలకు సీపీ సజ్జనార్ సూచనలు చేశారు.
జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దు
వాట్సాప్ లో డీపీగా నా ఫోటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది.
ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి.
ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి.
సైబర్ నేరగాళ్లకు మీ… pic.twitter.com/AuvB7XzLXr
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 25, 2025
కాగా హైదరాబాద్ సీపీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సోషల్ మీడియా వేదికగా ప్రజలతో నిత్యం మమేకమై ఉంటున్నారు. సైబర్ నేరాలు, సామాజిక బాధ్యత.. ఇలా చాలా అంశాలపై ప్రజలకు సూచనలు, హెచ్చరికలు చేస్తున్నారు.


