తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ పీపుల్స్ ప్లాజాలో నెలకొల్పిన నీరా కేఫ్(Neera Cafe)ను తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ఎక్సైజ్, పర్యాటకశాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నీరా కేఫ్ను పర్యాటకశాఖ నుంచి కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్కు బదిలీ చేసింది.
ఆ భూమి పర్యాటక శాఖకు చెందినది కావడంతో నీరా కేఫ్ నుంచి వచ్చే ఆదాయంలో 30శాతం టూరిజం శాఖకు చెల్లించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ, పర్యాటకశాఖ, రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇందుకు సహకరించిన ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కల్లుగీత విభాగం అధ్యక్షులు నాగరాజు గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.