Tuesday, September 17, 2024
HomeతెలంగాణPalakurthi: అవార్డులిచ్చి అభినందిస్తారు నిధులివ్వరు

Palakurthi: అవార్డులిచ్చి అభినందిస్తారు నిధులివ్వరు

అన్ని రంగాల్లో అగ్ర‌గామిగా ఉన్న తెలంగాణ‌ను అవార్డులిచ్చి అభినందిస్తారు…కానీ, నిధుల‌ను త‌గ్గించి నీరుగారుస్తారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఇలాంటి ప్ర‌భుత్వాల‌కు త‌గిన బుద్ధి చెప్పేలా ప్ర‌జ‌ల‌ను స‌మాయ‌త్తం చేయాల‌ని ఎర్రబెల్లి పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వ‌ పథకాలను ఇంటిటికీ తీసుకెళ్లే బాధ్యత బీఆరెస్ పార్టీ కార్యకర్తలపై ఉందని ఆయన అన్నారు. బిఅర్ఎస్ పార్టీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం నాంచారి మడూరు, వెలిక‌ట్ట‌లకు కలిపి తొర్రూరు రామా ఉపేంద‌ర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ. తెలంగాణ ప‌ట్ల కేంద్ర వైఖ‌రిని దుయ్య‌బ‌ట్టారు. కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వం తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. తెలంగాణ అభివృద్ధికి స‌హ‌క‌రించ‌క‌పోగా, అడ్డుపుల్ల వేస్తున్న‌ది. నిధుల‌కు కోత పెట్టి, నిందిస్తున్న‌ది. న్యాయంగా తెలంగాణ‌కు రావాల్సిన నిధుల‌ను కూడా నిలిపివేస్తున్న‌ది. ఈ వైఖ‌రి కార‌ణంగా తెలంగాణ అభివృద్ధి కుంటు ప‌డుతున్న‌ది. అయినా, సీఎం కెసిఆర్ తెలంగాణ‌ను అన్ని రంగాల్లో అగ్ర‌గామిగా నిలిపారు. దేశానికే ఆద‌ర్శంగా తీర్చిదిద్దారు. దీంతో అవార్డుల మీద అవార్డులు ఇస్తున్న కేంద్రం, రాష్ట్రానికి న‌యా పైసా ఇవ్వ‌డం లేదు. ఇదే విష‌యాన్ని నేను మొన్న ఢిల్లీలో రాష్ట్రంలోని గ్రామాల‌కు 13 అవార్డులు రాగా, తీసుకోవ‌డానికి వెళ్ళిన‌ప్పుడు వేదిక మీదే నిల‌దీశాను. రాష్ట్ర ప‌తి ముందు కేంద్ర వైఖ‌రిని విష్ప‌ష్టం చేశాను. అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు.

ఇక‌, తాను పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో పాత కొత్త తేడా లేకుండా కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని..సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా స‌మృద్ధిగా సాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబార‌క్‌ పథకాలు దేశానికే ఆద‌ర్శంగా మారాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాల‌లో రాష్ట్రం దేశంలోనే నెం.1 గా నిలిచిందని ప్రశంసించారు.

మరోవైపు నియోజకవర్గం లో చేసిన అభివృద్ధిని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. దేవాలయాల, చారిత్రక ప్రదేశాల, గ్రామాల అభివృద్ధికి సంబందించిన వివరాలను మంత్రి తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో చెరువుల బాగు, మిషన్ భగీరథ మంచి నీరు, రిజర్వాయర్లు, చెరువులను నింపడం, ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ వంటి పలు పథకాలు, రోడ్లు, మండల కేంద్రాల అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాలను మంత్రి సోదాహరణంగా వివరించారు.

ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు చైర్ ప‌ర్స‌న్‌ ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ, ద‌యాక‌ర్ రావు. తాను నిరంత‌రం నియోక‌వ‌ర్గ అభివృద్ధి గురించి, ప్ర‌జ‌ల బాగోగుల‌ గురించే ఆలోచిస్తాం. ఇలాంటి నాయ‌కుడు ఎమ్మెల్యేగా దొర‌క‌టం ప్ర‌జ‌ల‌ అదృష్టం. బిఆర్ ఎస్ పార్టీని, సిఎం కెసిఆర్ ని, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుల‌కు అండ‌గా ఉండాలని చెప్పారు.

మ‌హిళ‌ల‌కు వ‌డ్డిస్తూ, వారితో క‌లిసి ఆత్మీయ భోజ‌నాలు
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో బాగంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఆయ‌న స‌తీమ‌ణి, ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు చైర్ ప‌ర్స‌న్ ఎర్ర‌బెల్లి ఉషా ద‌యాక‌ర్ రావులు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు స్వ‌యంగా వ‌డ్డించారు. మ‌హిళ‌ల‌తో క‌లిసి భోజ‌నాలు చేశారు. అంత‌కుముందు ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్ర‌బెల్లి ఉషా దయాకర్ రావు ఆత్మీయ సమ్మేళ‌నంలో ఆత్మీయ అతిథిగా పాల్గొని, సిఎం సందేశం చ‌దివి వినిపించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామాల వారీగా పార్టీ ముఖ్యులు, నాయకులు, కార్యకర్తల పేర్లు చదువుతూ వాళ్ళందరికీ ఆత్మీయ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వారితో క‌లిసి ఫోటోలు దిగుతూ, వారితో త‌మ ఆత్మీయ‌త‌ను చాటుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కార్యకర్తలతో మాట్లాడి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం, పార్టీ పరంగా జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన వివరాలు ముఖ్య నాయకులు కార్యకర్తలు ద్వారా మాట్లాడించారు. ఆయా గ్రామాల వారీగా ఇంకా మిగిలి ఉన్న సమస్యలు, చేయాల్సిన పనులు, జరగాల్సిన అభివృద్ధిపై కార్యకర్తలతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు.

ఆయా గ్రామాల ప్రజలు కార్యకర్తలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే మంత్రి పరిష్కరించారు. ఇండ్లు, పెన్షన్లు, దళిత బంధు, కమ్యూనిటీ హాళ్లు వంటివి చర్చించారు. కొన్ని సామాజిక కులాలకు కమిటీ హాళ్లు, గుడులను అక్కడికక్కడే మంత్రి మంజూరు చేశారు. అంతకుముందు…మంత్రికి ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. దారి పొడవునా పూలు చల్లుతూ, కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, నృత్యాలు చేస్తూ, ఘనంగా స్వాగతించారు. మంత్రి వేదిక పక్కనే ఏర్పాటు చేసిన పార్టీ జెండా ను ఆవిష్కరించారు. వేదిక మీదే అమర వీరులకు నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు యువత విభాగం రైతుబంధు సమితి బాధ్యులు, బి అర్ ఎస్ పార్టీ వివిధ విభాగాల బాధ్యులు, ఆయా గ్రామాల పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News