Perni Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్షపై నాని ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆయన కీలక సాక్షిగా ఉన్నారు. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించి ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదు. తమ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం పలు సార్లు ఆదేశించింది. అయినా కానీ ఆయన హాజరుకాకపోవడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేర్ని నానిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రేషన్ బియ్యం అక్రమాలపై ఆయనతో పాటు భార్య జయసుధపై కూడా కేసు నమోదైంది. దీంతో వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. అనంతరం ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.
పేర్ని నాని వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. అరెస్ట్ భయంతో నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మర్వో ఆఫీసులో నకిలీ పట్టాలు రాస్తుంటే తాము పట్టుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2023లో తహసీల్దార్ బదిలీ అయితే 2024లో ఎన్నికల ముందు సీఆర్జెడ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఎలా ఇప్పించారు? అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ఆయన దోచుకున్న అవినీతి సొమ్మును మొత్తం కక్కిస్తామన్నారు. వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో పేర్ని నాని ఒక బ్రోకర్లా వ్యవహరించారంటూ ఘాటు విమర్శలు చేశారు.
మరోవైపు పోలీసులపై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. రేషన్ బియ్యం దుర్వినియోగం కేసు దర్యాప్తు చేస్తున్న బందర్ రూరల్ సీఐను గాడు అని ఏకవచనంతో సంబోధించడం.. బెదిరించడం సరికాదని అభిప్రాయపడింది.
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES