తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. బొడ్డురాయిసెంటర్ వద్ద రోడ్డుపై నిలబడి ఉన్న రాజు అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి, అనంతరం అతడిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లి కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణ స్పందిస్తూ… పాత కక్షల కారణంగానే నందిగం సురేష్, అతని అన్నతో పాటు మరొరువురు రాజుపై దాడికి పాల్పడ్డారని తెలిపారు.
ఇంటి వద్ద కూడా రాజును పడేసి, కాళ్లతో తన్ని తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. అంతేగాక, రాజును చంపి కృష్ణా నదిలో పడేయాలని నందిగం కుటుంబ సభ్యులు చెప్పుకుంటుండటం విన్నానని రాజు ఫిర్యాదులో వెల్లడించాడు. అయితే అక్కడి నుంచి తప్పించుకున్న రాజు తన బంధువుల సాయంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.
ఈ కేసులో నందిగం సురేష్పై సెక్షన్ 140(1), 127(2), 109(1), 351(2) R/W 3(5) BNS కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. ఇప్పటికే సురేష్పై 12 కేసులు ఉన్నాయని, అందులో హత్య కేసు కూడా ఉందని పేర్కొన్నారు. బెయిల్ మీద బయట ఉన్నప్పటికీ మళ్లీ తీవ్రంగా దాడికి పాల్పడటంతో అతడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మిగిలిన నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.