Tuesday, September 17, 2024
Homeహెల్త్Oil food: ఆయిలీ ఫుడ్ తిన్నారా..ఇలా చేస్తే మంచిది

Oil food: ఆయిలీ ఫుడ్ తిన్నారా..ఇలా చేస్తే మంచిది

నూనెతో చేసిన వంటకాలంటే చాలామంది ఇష్టపడతాం. అవి బాగా రుచిగా ఉండడం వల్ల ఎక్కువ లాగించేస్తుంటాం కూడా. ఇలా నూనె వస్తువులు తినడం వల్ల శరీరంపై వాటి దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీళ్లపై ఆ ప్రభావం పడకుండా ఉండడానికి కొన్ని ఫుడ్స్ తింటే మంచి ఫలితం ఉంటుంది. అవేమిటంటే…

- Advertisement -

 నూనె వస్తువులు తిన్నప్పుడు కడుపు ఉబ్బరించడం, గ్యాసు బాధ, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఈ ప్రభావం నుంచి బయటపడటానికీ, జీర్ణక్రియ మళ్లా గాడిలో పడడానికి ఒక మార్గం ఉంది. హెవీ ఫుడ్ తిన్నతర్వాత గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణ క్రియ సులభంగా జరుగుతుంది. అంతేకాదు మీలోపలి ఆయిలీ ఫీలింగును సైతం ఇది పూర్తిగా పోగొడుతుంది.

 నూనె వస్తువులు తిన్న తర్వాత తలెత్తే సమస్యల నుంచి బయటపడటానికి గ్రీన్ టీ తాగడం మరో మంచి ప్రత్యామ్నాయం. ఇందులోని యాంటాక్సిడెంట్లు తిన్న నూనె పదార్థాలు సులభంగా జీర్ణమయ్యేలా సహకరిస్తాయి.

 ఒక లీటరు నీళ్లల్లో ఒక టీస్పూను వాము లేదా సోంపు గింజలను వేసి ఆ నీళ్లను గోరువెచ్చగా చేసి కొద్ది కొద్దిగా తాగాలి. వాము, సోంపు గింజల్లో జీర్ణశక్తిపై బాగా పనిచేసే గుణాలు ఉన్నాయి. ఇవి మీరు తిన్న నూనె పదార్థాలను సులభంగా జీర్ణమయ్యేట్టు చేయడమే కాకుండా కడుపు ఉబ్బరం, గ్యాసు, అజీర్తి వంటి సమస్యల బారిన పడకుండా కాపాడతాయి. వేడి నీళ్లల్లో అల్లం కొట్టి వేసి తాగితే కూడా తిన్న నూనె పదార్థాలు సులభంగా జీర్ణమవుతాయి. ఇది జీర్ణ కోశ కండరాలను వదులుచేయడం ద్వారా గ్యాసు సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది.

 ఒక బౌవుల్ లో పెరుగు తీసుకుని అందులో కొద్దిగా జీరా వేసి తింటే పెరుగులోని గుడ్ బాక్టీరియా వల్ల మీరు తిన్న బరువైన ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

 బరువైన నూనె పదార్థాలు తిన్న మర్నాడు పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్న హోల్ గ్రెయిన్ బ్రేక్ ఫాస్ట్ తినాలి. ఇది నూనె పదార్థాల వల్ల శరీరంలో చేరిన కొలెస్ట్రాల్ ని బయటకు పోగొడుతుంది. లేదా ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకున్నా మీ జీర్ణవ్యవస్థకు కొంత సాంత్వన లభిస్తుంది. వీటిల్లోని పీచుపదార్థాల వల్ల జీర్ణాశయం పూర్తిగా శుభ్రం అవుతుంది. హోల్ గ్రెయిన్ తినడం వల్ల తొందరగా కడుపు నిండి చాలా సేపు వరకూ ఆకలి వేయదు కూడా.

 లేదా నూనె వస్తువులు తిన్న మర్నాడు సీజనల్ గా వచ్చే పండ్లు, కూరగాయలను తింటే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. వీటిని తినడం వల్ల శరీరానికి పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు బాగా అందుతాయి. పండ్లు తినడం వల్ల శరీరానికి కావలసినంత నీరు అందుతుంది. అంతేకాదు ఇవి ద్రవరూపంలో శరీరానికి కావలసిన ఆరోగ్యవంతమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. దీంతో శరీరం బాగా హైడ్రేట్ అవుతుంది.

 లేదా కొన్ని నట్స్, గింజలను మర్నాడు పరిమిత పరిమాణంలో తినాలి. కొన్ని బాదం, వాల్ నట్స్, చియా సీడ్స్ ను భోజనానికి మధ్య టైములో స్నాక్ లా తింటే మంచిది.

 నూనె వస్తువులతో తిన్న ఆహారంతో ఎంతో బరువుగా ఉంటుంది కాబట్టి మర్నాడు తినే లంచ్ తేలికగా ఉండేలా చూసుకోవాలి. కిచిడి లేదా చపాతీ, పెసరపప్పు లేదా దాల్ చావల్ , దహి చావల్ తీసుకోవాలి.

 ఆయిలీ ఫుడ్ తిన్న వెంటనే అస్సలు పడుకోకూడదు. రెండు గంటలు మెలుకువగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణమవుతుంది. తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణక్రియ నెమ్మదించి తిన్న నూనె వస్తువులు కడుపులో జీర్ణకాకుండా ఉంటాయి. పులుపెక్కుతాయి. ఆ తర్వాత ఎసిడిటీతో బాధ పడాల్సి ఉంటుంది.

 నూనె పదార్థాలు తిన్న తర్వాత అరగంట నుంచి 40 నిమిషాలు నడవాలి. ఇలా నడవడం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News