Social Media Ban in Australia from December 10: ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి సోషల్ మీడియాను బ్యాన్ చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఈ బ్యాన్ అందరికీ వర్తించదని, కేవలం 16 ఏళ్లలోపు యువత, చిన్నారులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. ప్రపంచంలో 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్ను విధించిన మొట్ట మొదటి దేశంగా అవతరించనుంది. తాజా నిర్ణయం అమల్లోకి రావడం ద్వారా ఆస్ట్రేలియాలో ఇకపై 16 ఏళ్లలోపు పిల్లలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా సైట్లను యాక్సెస్ చేయలేరు. ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ (AIHW) జూన్ 2021 డేటా ప్రకారం.. ఆస్ట్రేలియాలో దాదాపు 4.04 మిలియన్ల మంది 16 ఏళ్లలోపు పౌరులు ఉన్నారు. ఈ సమూహం మొత్తం జనాభాలో దాదాపు 16 శాతంగా ఉంది. తాజా నిర్ణయం ద్వారా ఇప్పుడు దేశంలో దాదాపు నాలుగు మిలియన్ల సోషల్ మీడియా అకౌంట్లను నిషేధించనున్నట్లైంది.
డిసెంబర్ 10 నుంచి అమల్లోకి..
ఆస్ట్రేలియాలో ఈ నిషేధం డిసెంబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో అప్పటి నుంచి దేశంలోని టీనేజర్లు సోషల్ మీడియాను ఉపయోగించలేరు. ప్రపంచంలోనే టీనేజర్లను సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధించిన మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించనుంది. టిక్టాక్, స్నాప్చాట్, మెటా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్లు వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను 16 ఏళ్లలోపు వారు ఉపయోగించలేరు. ఇప్పటికే దేశంలో ఈ నిషేధాన్ని అమలు చేయడానికి సన్నాహాలు వేగవంతం అవుతున్నాయి. ఇప్పటికే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, టిక్టాక్, స్నాప్చాట్, మెటా ప్లాట్ఫామ్లు 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్లను రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి. ఆయా యాప్లలో రిజిస్ట్రేషన్ సమయంలోనే వయస్సును నిర్థారించాల్సి ఉంటుంది. అయితే, కొంతమంది టీనేజర్లు తమ వయస్సును ఎక్కువగా చూపించి.. యాప్లోకి లాగిన్ అవుతున్నారు. అటువంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త నిబంధనలు చేర్చింది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు రాబోయే రోజుల్లో పది లక్షలకు పైగా ఆస్ట్రేలియన్ టీనేజర్లకు సందేశాలను పంపించనున్నాయి. తద్వారా, వారి ప్రొఫైల్లు లాక్ అవుతాయని అధికారులు చెబుతున్నారు.
Also Read: https://teluguprabha.net/business/amazon-bumper-offer-on-power-bank-and-earbuds/
నిషేధం వెనుక కారణాలేంటి?
ఈ డిజిటల్ ప్రపంచంలో పిల్లల మానసిక ఆరోగ్యానికి సోషల్ మీడియా అడ్డంకిగా మారింది. పిల్లలు సోషల్ మీడియాకు అడెక్ట్ అవడం ద్వారా అనేక అనర్థాలు దాపురిస్తున్నాయని ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. అందుకే, ఆన్లైన్ భద్రతా సవరణ (సోషల్ మీడియా కనీస వయస్సు) బిల్లు 2024ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ యాక్ట్ ప్రకారం, ఇకపై మైనర్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, యూట్యూబ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), రెడ్డిట్, థ్రెడ్స్, కిక్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అకౌంట్లను క్రియేట్ చేసుకోవడం లేదా యాక్సెస్ చేయడం నిషేధం. ఈ కొత్త యాక్ట్ డిసెంబర్ 10 నుండి అమల్లోకి వస్తుంది. 13-15 సంవత్సరాల వయస్సు గల దాదాపు 2 లక్షలకు పైగా ఉన్న ఆస్ట్రేలియన్ యూజర్లను టిక్టాక్ రిస్ట్రిక్ట్ చేయనుంది. ఇందుకోసం ఒక ప్రత్యేక బటన్ను అభివృద్ధి చేస్తున్నట్లు టిక్టాక్ పార్లమెంటుకు తెలిపింది. ఇతర యాప్లు కూడా టీనేజర్లను గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి. కొన్ని యాప్లు సెల్ఫీల ఆధారంగా వయస్సును అంచనా వేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.


