CM Chandrababu Serious: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు.
మరోవైపు ఈ ఘటనను ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అప్పు తీర్చలేదని కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేయడం అమానుషమని మండిపడ్డారు. ఇది సభ్య సమాజం తల దించుకొనే దుశ్చర్య అని.. కన్న కొడుకు ముందే తల్లికి జరిగిన ఘోర అవమానమని పేర్కొన్నారు. తెలుగింటి ఆడపడుచుకి సీఎం ఇలాకాలోనే రక్షణ లేదు అనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. మహిళల మీద ఇలాంటి దాడులు జరగడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు అని విమర్శించారు. ఇలాంటి అమానవీయ ఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఆ మహిళకు జరిగిన అవమానానికి బాధ్యత వహించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా కుప్పం మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప అనే వ్యక్తి వద్ద మూడేళ్ల క్రితం రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పులు బాధ భరించలేక తిమరాయప్ప గ్రామం వదిలి వెళ్లిపోయాడు. కానీ భార్య శిరీష మాత్రం పుట్టింట్లో ఉంటూ బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. అయితే కుమారుడి టీసీ కోసం గ్రామానికి వచ్చిన శిరీషను మునికన్నప్ప కుటుంబం డబ్బులు చెల్లించాలని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే చెట్టుకు తాడుతో కట్టేసి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
CM Chandrababu: మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES