2025 Bonalu Jathara: ఆషాడ మాసంలో అమ్మవారిని అత్తింటి నుంచి పుట్టింటికి సారెతో సాగనంపే ఉత్సవమే బోనాలు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగం. బోనం అంటే భోజనం అని అర్థం. మట్టికుండలో పసుపుతో చేసిన అన్నం, దాని కింద మరో కుండలో వేపాకు నీళ్లు, అదే విధంగా ఈ కుండల మీద ఒక దీపంను వెలిగిస్తారు. దీన్నే బోనం అని పిలుస్తారు. దీన్ని అమ్మవారికి నైవేధ్యంగా సమర్పిస్తారు. నెలరోజులపాటు భాగ్యనగరంలోని పలు అమ్మవారి ఈ ఆలయాల్లో ఈ బోనాలను నిర్వహిస్తారు.
జూన్ 26న మెుదలై..
సాధారణంగా ఈ పండుగ ఆషాఢమాసంలోని తొలి ఆదివారం లేదా తొలి గురువారం వస్తుంది. ఈ ఏడాది జూన్ 26న గోల్కొండ జగదాంబిక ఆలయంలో నిర్వహించే ఉత్సవాలతో బోనాల పండుగ మొదలవుతుంది. జూన్ 29న తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోని బెజవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పిస్తారు. జూలై 02న బల్కంపేట ఎల్లమ్మ, 04న జూబ్లీహిల్స్ పెద్దమ్మ, 10న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, 13న లష్కర్ బోనాలు జరుగుతాయి. తర్వాత రోజు రంగం, భవిష్యవాణి ఉంటుంది.
జులై 15న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి, 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పిస్తారు. జూలై 20న పాతబస్తీలో సింహావాహిన అమ్మవారి జాతర కన్నుల పండుగగా జరుగుతుంది. జూలై 24న గోల్కొండలోని అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత బోనాల పండుగ ముగిసినట్లుగా భావిస్తారు. ఇక్కడ ముగిసిన బోనాల పండుగ తెలంగాణలోని పల్లెల్లో మెుదలవుతుంది. నెల రోజులపాటు సాగే ఈ ఉత్సవాలకు ఎంతో మంది భక్తుల తరలివస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది.