Friday, May 10, 2024
Homeఓపన్ పేజ్First phase polling: తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

First phase polling: తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

లోక్ సభ ఎన్నికలు 2024 పోలింగ్

ఒకవైపు భగభగమండే ఎండలు…మరోవైపు దేశవ్యాప్తంగా మొత్తం 102 లోక్‌సభ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్. ఎన్నికల పండగకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తమిళనాడులోని మొత్తం 39 నియోజవర్గాల్లో ఈనెల 19న ఒకేదఫా ఎన్నికలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు కావడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది సెగ్మెంట్లకు కూడా తొలిదశలోనే పోలింగ్ నిర్వహిస్తారు. ఈసారి బీహార్‌లో ఎన్డీయే కూటమి, మహాఘట్‌బంధన్‌ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బీహార్‌ ఎన్నికలు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక మహారాష్ట్రలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మొత్తం ఆరు పార్టీలు…ఈసారి రెండు కూటములుగా బరిలో నిలిచాయి. ఇదిలా ఉంటే రాజస్థాన్‌లోని మొత్తం పాతిక సీట్లలో విజయదుందుభి మోగించడానికి కమలం పార్టీ సన్నద్ధమైంది.

- Advertisement -

లోకసభ ఎన్నికలు తరుముకువస్తున్నాయి. ఈనెల 19న మొదటి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. తొలివిడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్ లో రెండేసి స్థానాలకు, చత్తీస్ గఢ్ లో ఒక స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. మధ్యప్రదేశ్ లో ఆరు సెగ్మెంట్లకు మహారాష్ట్రలో ఐదు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. వీటితోపాటు బీహార్‌లో నాలుగు నియోజకవర్గాలకు మణిపూర్, మేఘాలయలో రెండు సెగ్మెంట్లకు, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో ఒక్కో నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. అంతేకాదు రాజస్థాన్ లో 12 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది సెగ్మెంట్లకు , ఉత్తరాఖండ్ లో ఐదు నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్‌లో మూడు సెగ్మెంట్లకు పోలింగ్ జరుగుతుంది. వీటితోపాటు పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో కూడా తొలిదశలో భాగంగా కొన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. తమిళనాడులో మొత్తం 39 సెగ్మెంట్లకు పోలింగ్ తమిళనాడులోని మొత్తం 39 నియోజవర్గాల్లో ఈనెల 19న ఒకేదఫా ఎన్నికలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు కావడం విశేషం. తమిళనాడు రాజకీయాలు ఈసారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సహజంగా తమిళనాట ఎప్పుడూ ఎన్నికల గోదాలో రెండు శిబిరాలే తలపడతాయి. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మూడు కూటములు బరిలో ఉన్నాయి. ఇందులో మొదటిది డీఎంకే – కాంగ్రెస్ కూటమి. డీఎంకే ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమిలో కూడా డీఎంకే కూడా భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకే సాయంతో తమిళనాడులో కొన్ని సీట్లు అయినా సునాయాసంగా గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంది. కాగా అన్నాడీఎంకేతో తాజాగా సినీ నటుడు విజయ్‌కాంత్ నాయకత్వంలోని డీఎండీకే జత కట్టింది. డీఎండీకే కు ఐదు సీట్లు ఇవ్వడానికి పళనిస్వామి అంగీకరించారు. అలాగే ఎస్డీపీఐ, పుదియ తమిళగం పార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు పళనిస్వామి. ఇదిలా ఉంటే మజ్లిస్ పార్టీతో అన్నా డీఎంకే తాజాగా పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తుతో ముస్లిం మైనారిటీలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని అన్నాడీఎంకే భావిస్తోంది. కాగా భారతీయ జనతా పార్టీ 19 స్థానాలకు పోటీ చేస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్బుమణి పట్టాళి మక్కళ్ మున్నేట్ర కజగం పది సెగ్మెంట్లలో పోటీ చేస్తోంది. అలాగే పొత్తులో ఉన్న చిన్న పార్టీలకు ఒకట్రెండు సీట్ల చొప్పున బీజేపీ కేటాయించింది. తమిళనాడులో నిన్నమొన్నటివరకు భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉండేదికాదు. ఒకసారి డీఎంకేతో మరోసారి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటూ కాలం గడిపేసింది కమలం పార్టీ. అయితే తాజాగా తమిళనాట బీజేపీకి అన్నామలై పెద్ద దిక్కుగా నిలిచాడు. కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి అన్నామలై బరిలో నిలిచారు.తమిళనాడులో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం హోరెత్తించారు. దశాబ్దాల నాటి కచ్చతీవు దీవిని ప్రచారాస్త్రాంగా చేసుకున్నారు. మన భూభాగంలో భాగమైన కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసి తమిళుల ప్రయోజనాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపడ్డారు. తూత్తుకుడిలో భారీ సభ నిర్వహించి తమిళనాడుకు వరాలు ప్రకటించారు. యూపీలో ఎనిమిది సెగ్మెంట్లకు పోలింగ్ ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 80 లోక్‌సభ సీట్లున్నాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలంటే ముందుగా ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాల్సి ఉంటుంది. ఏప్రిల్ 19న ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి విడత ఎన్నికలు జరగనున్న జాబితాలో సహరన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్‌, బిజ్నూర్‌, నగీనా, రాంపూర్‌, పిల్‌భిత్ నియోజకవర్గాలున్నాయి.ఈ ఎనిమిదిలో ముజఫర్‌నగర్, కైరానా, పిల్‌భిత్..బీజేపీ సిట్టింగ్ సీట్లు కావడం విశేషం. ఇక్కడ ఓ విశేషం ఉంది. పిల్‌భిత్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి ఈసారి టికెట్ ఇవ్వలేదు. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న జితిన ప్రసాద్‌కు పిల్‌భిత్ టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సత్తా చూపగల ఉప ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇటీవల జయంత్ చౌధురి నాయకత్వానగల రాష్ట్రీయ లోక్‌దళ్ తో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. రాష్ట్రీయ లోక్‌దళ్ కు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో గట్టి పట్టుంది. అంతేకాదు ఆర్ఎల్‌డీ మద్దతుతో జాట్ సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని మరో ఉప ప్రాంతీయ పార్టీ భారతీయ సమాజ్‌ పార్టీతోనూ కమలం పార్టీకి పొత్తు ఉంది. సుహేల్‌దేవ్ నాయకత్వంలోని భారతీయ సమాజ్ పార్టీ …పూర్వాంచల్ ప్రాంతంలో బలంగా ఉంది. దీంతో పూర్వాంచల్ ప్రాంతం ఓట్లు తమ ఖాతాలోనే పడతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80స్థానాలనూ గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయోధ్యలో రామ జన్మభూమి మందిరం నిర్మాణం, బాల రాముడి ప్రతిష్టతో ప్రజల్లో పెరిగిన సెంటిమెంట్ ను ఓట్లుగా మరల్చుకోవాలనే లక్ష్యంతో మందుకు సాగుతోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ ఓట్లు రాలుస్తుందని భరోసాతో ఉన్నారు కమలనాథులు. కాగా కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌కు 17 సీట్లు కేటాయించింది సమాజ్‌వాదీ పార్టీ. మిగతా 63 సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ సహా ఇండియా కూటమిలోని మిగతా భాగస్వామ్యపక్షాలు పోటీ చేస్తున్నాయి. బీహార్‌లో నాలుగు సెగ్మెంట్లకు పోలింగ్ బీహార్లో మొత్తం 40 లోక్‌సభ సెగ్మెంట్లున్నాయి. కాగా ఏప్రిల్ 19న నాలుగు నియోజకవర్గాలు ఔరంగాబాద్‌, నవాడా, గయ, జమూయ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈసారి బీహార్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికలు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. మారిన సమీకరణల నేపథ్యంలో కొన్ని నెలలకిందట జేడీ యూ అధినేత నితీశ్‌ కుమార్ రాజకీయంగా యూ టర్న్ తీసుకున్నారు. ఇండియా కూటమి నుంచి వైదొలగారు. మళ్లీ ఎన్డీయే కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ అండతో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో సామాన్య ప్రజల్లో నితీశ్ కుమార్‌కు అవకాశవాది అనే ముద్ర పడింది. నితీశ్ కుమార్ పొలిటికల్‌గా యూ టర్న్ తీసుకున్న తీరు ఎన్డీయే కూటమికి మైనస్ పాయింట్ అవుతుందని ఒక వర్గం భావిస్తోంది. ఈ బీహార్లో మెజారిటీ యాదవ సామాజికవర్గాన్ని రాష్ట్రీయ జనతాదళ్‌ వైపు మళ్లించడంలో తేజస్వి యాదవ్ చాలా వరకు సక్సెస్ అయినట్లు వార్తలందుతున్నాయి. అలాగే ముస్లిం మైనారిటీలు కూడా మహాఘట్‌బంధన్‌కు అనుకూలంగా మారారన్న వార్తలు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ, నితీశ్‌ కుమార్ నాయకత్వంలోని జేడీ యూ ఒక కూటమిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ కూటమిలో మరికొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ 17 సెగ్మెంట్లలో పోటీ చేస్తోంది. కాగా జనతాదళ్‌ యునైటెడ్ పార్టీ 16 సీట్లలో బరిలో దిగుతోంది. కాగా బీహార్‌లో కాంగ్రెస్ అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి. రెండు కూటములుగా ఆరు పార్టీలు దేశ రాజకీయాల్లో మహారాష్ట్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా 48 మంది సభ్యులను లోక్‌సభకు పంపేది మహారాష్ట్రే. ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆరు పార్టీలు ప్రస్తుతం రెండు కూటములుగా ఏర్పడ్డాయి. ఎన్నికల గోదాలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఒకవైపు ఉద్ధవ్ బాలా సాహెబ్ థాక్రే నాయకత్వంలోని శివసేన , కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గంతో కూడిన మహా వికాస్ ఆఘాడీ ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గం, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ వర్గం మహా కూటమిగా ఏర్పడి, రంగంలో నిలిచింది. మహారాష్ట్ర రాజకీయాలను శివసేన చాలాకాలం పాటు శాసించింది. శివసేన హవా బలంగా వీసిన నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ స్వంతంగా పాగా వేయలేకపోయింది. దీంతో మరాఠాల భూమిని ఎలాగైనా తమ ఆధీనంలోకి తీసుకురావడానికి బీజేపీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఇందులో భాగమే …శివసేనను చీల్చడం. ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్‌లో నెంబర్‌ టూగా ఉన్న ఏక్‌నాథ్ షిండేను శివసేన అధిష్టానంపై తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించింది. దీంతో కొన్ని నెలల కిందట శివసేన రెండుగా చీలిపోయింది. చీలికవర్గం నాయకుడైన ఏక్‌నాథ్ షిండేకు బీజేపీ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రిని చేసింది. అలాగే శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కూడా మహారాష్ట్రలో పట్టుంది. అయితే శరద్ పవార్ పార్టీని చీల్చడానికి ఆయన దగ్గరి బంధువు అజిత్ పవార్‌ను పావుగా వాడుకుంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో కొన్ని నెలల కిందట నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ చీలికవర్గం బీజేపీ శిబిరంలో చేరింది. అంతిమంగా ఏక్‌నాథ్ షిండే క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ చేరారు. ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన చీలిక వర్గం అలాగే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ చీలికవర్గం …బీజేపీకి జూనియర్ పార్ట్‌నర్‌లుగా మారాయి. మరాఠా రిజర్వేషన్ల విషయం ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకాంశంగా మారింది. బీజేపీకి కంచుకోటగా రాజస్థాన్ ! తొలి విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాజస్థాన్‌ కూడా ఉంది. రాజస్థాన్‌లో మొత్తం 25 నియోజకవర్గాలున్నాయి. తొలి దశలో అల్వార్, భరత్ పూర్, బికనీర్, చురు, దౌసా, గంగానగర్, జైపూర్ అర్బన్‌, జైపూర్ రూరల్, ఝుంఝును, కరౌలి-ధోల్పూర్, నాగౌర్, సికార్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. వాస్తవానికి రాజస్థాన్ ప్రాంతం విభిన్నమైన సంస్కృతికి ప్రతీక. రాజస్థాన్ లో ఐదేళ్ల కొకసారి రాష్ట్ర ప్రభుత్వం మారే ఆనవాయితీ ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఒక టర్మ్ అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. రాజుల కోటగా పేరున్న రాజస్థాన్‌ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి అడ్డాగా ఉంది. జాతీయ రాజకీయాల్లో నరేంద్ర మోడీ హవా మొదలైనప్పటి నుంచి కమలం పార్టీకి రాజస్థాన్ దుర్భేద్యమైన కోటగా మారింది. రాజస్థాన్‌లో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. సారి కూడా మొత్తం సెగ్మెంట్లు గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. మొత్తం పాతిక సెగ్మెంట్లను గెలుచుకునే బాధ్యతను రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజే తమ అభ్యర్థులను గెలుపు తీరాలకు చేరుస్తుందని కమలనాథులు భరోసాతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే రాజస్థాన్ లో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఈ పరాజయం నుంచి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో బీజేపీ దూకుడును తట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఐదు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా ఈ ఐదు సెగ్మెంట్లలో మొహరించింది. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా బోణీ కొట్టాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అందుకుతగ్గ వ్యూహాలతో ప్రచారాన్ని హోరెత్తించింది. మొత్తం పాతిక సీట్లను తమ ఖాతాలో వేసుకుని రాజస్థాన్‌లో తమకు తిరుగేలేదని చాటాలని భారతీయ జనతా పార్టీ ఉబలాటపడుతోంది. అయితే కనీసం కొన్ని సీట్లయినా గెలుచుకుని గౌరవం దక్కించుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. మొత్తం మీద రాజస్థాన్‌పై కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదన్నది వాస్తవం.

– ఎస్‌. అబ్దుల్ ఖాలిక్,

సీనియర్ జర్నలిస్ట్

63001 74320

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News